బెంగళూరు : భారత్లో త్వరలో మరో కొవిడ్ టీకా అందుబాటులోకి రానున్నది. అహ్మదాబాద్కు చెందిన ఫార్మా కంపెనీ జైడస్ క్యాడిలా తయారు చేసిన కొవిడ్ టీకా జైకోవ్-డీ కోసం అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి గురువారం దరఖాస్తు చేసింది. అనుమతి లభిస్తే ఏటా 120 మిలియన్ మోతాదుల డోసులను ఉత్పత్తి చేయాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం భారత్లో సీరం ఇన్స్టిట్యూట్ కొవిషీల్డ్, భారత్ బయోటెక్ కంపెనీ కొవాగ్జిన్, రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ టీకాలకు డీసీజీఐ అనుమతి ఇవ్వగా.. వ్యాక్సినేషన్లో వినియోగిస్తున్నారు. మోడెర్నా టీకా దిగుమతి కోసం సైతం ఇటీవల డీసీజీఐ అనుమతి ఇవ్వగా.. ప్రస్తుతం జైడస్ క్యాడిలా వ్యాక్సిన్కు అనుమతి లభిస్తే వస్తే ఐదో టీకాగా నిలువనుంది.
కంపెనీ 12-18 సంవత్సరాల వయసు పిల్లలతో సహా దేశవ్యాప్తంగా 50కిపైగా కేంద్రాల్లో 28వేల మంది వలంటీర్లపై ట్రయల్స్ నిర్వహించింది. చివరి దశ ట్రయల్స్లో జైకోవ్-డీ సామర్థ్యాన్ని చూపిందని కంపెనీ పేర్కొంది. కరోనా కొత్త వేరియంట్లు, డెల్టా వేరియంట్కు వ్యతిరేకంగా టీకా పని సమర్థవంతంగా పని చేస్తుందని పేర్కొంది. జైడస్ క్యాడిలా టీకా ప్లాస్మిడ్ డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్. దేశంలో 12-18 సంవత్సరాల వయస్సులో కౌమార బాలలపై కొవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించడం ఇదే మొదటిసారి. ప్లాస్మిడ్ డీఎన్ఏ ప్లాట్ఫామ్ ప్లగ్ అండ్ ప్లే టెక్నాలజీ కరోనా వైరస్లోని ఉత్పరివర్తనాలను ఇది సులభంగా ఎదుర్కోవటానికి అనుకూలంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.