కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 15 : ముంపు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడం కోసం నాలా విస్తరణ పనులు చేపడుతున్నట్లు కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. బుధవారం మూసాపేట సర్కిల్లో సమతానగర్, జింకలవాడలో వరదనీటి కాలువను జడ్సీ మమత, వివిధ విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో ముంపు సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందన్నారు. దీనిలో భాగంగా వర్షంనీటి కాలువలను విస్తరిస్తున్నట్లు తెలిపారు. సమతానగర్ నుంచి జింకలవాడ మధ్యలో 230 మీటర్ల దూరం వర్షంనీటి కాలువలను విస్తరించడం వల్ల ముంపు సమస్యలు తీరుతాయన్నారు. దీనికోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ చిన్నారెడ్డి, సీపీ ఉమాదేవి, డీసీ రవికుమార్, ఈఈ సత్యనారాయణ, ప్రాజెక్టు విభాగం అధికారులు పాల్గొన్నారు.