కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 13 : ఒమిక్రాన్ ప్రమాదం పొంచిఉన్న నేపథ్యంలో అందరూ టీకాలు వేయించుకోవాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. సోమవారం మూసాపేట సర్కిల్ పరిధిలోని కేపీహెచ్బీ కాలనీ, అల్లాపూర్, మూసాపేట వార్డులలో వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనాను కట్టడి చేయాలంటే వందశాతం ప్రజలు రెండు డోస్ల టీకాలు వేయించుకోవాలని కోరారు. కరోనా టీకాలు వేసేందుకు ఉదయంతో పాటు సాయంత్రం వ్యాక్సినేషన్ డ్రైవ్ను చేపడుతున్నామని వార్డుల వారీగా నోడల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో ఇంటింటికీ సర్వే చేస్తూ అర్హులందరికీ టీకాలు వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వృద్ధులకు ఇంటివద్దకే వచ్చి టీకా వేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీసీ రవికుమార్, ఏఎంహెచ్వో సంపత్కుమార్, ఎస్ఎస్ మురళీధర్రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇప్పటి వరకు కాలనీ సెంటర్లలో టీకాలు వేసిన బృందాలు ఇకపై వృద్ధులకు ఇంటికే వెళ్లి టీకాలు వేయనున్నట్లు తెలిపారు. నడవలేని వృద్ధులు టీకాల కోసం నోడల్ ఆఫీసర్లకు ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి వారికి కరోనా టీకాలు వేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, కూలీ చేసుకునే ప్రజల కోసం సాయంకాలం వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభించినట్లు తెలిపారు. పేద ప్రజలు నివసించే బస్తీలకు ప్రాధాన్యతనిస్తూ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు కరోనా టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. నేటినుంచి ఉదయం, సాయంకాలం వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలని కరోనా నుంచి రక్షణ పొందాలని కోరారు.
కూకట్పల్లి జోన్ పరిధిలోని మూసాపేట, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్ సర్కిళ్లలో కలిపి 20.20 లక్షల మంది జనాభా ఉండగా వీరిలో 18 సంవత్సరాలు నిండిన వారు 13,83,236 మంది ఉన్నట్లు తేలింది. వీరిలో 9,48,134 మంది ఫస్ట్డోస్ టీకాను వేసుకోగా ఇంకా 4,35,102 మంది ఫస్ట్డోస్ టీకా వేయించుకోవాల్సి ఉంది. 6,73,780 మందికి సెకండ్ డోస్ టీకాలు వేయగా మరో 2,74,354 మంది సెకండ్ డోస్ టీకాను వేయించుకోవాల్సి ఉంది. ఫస్ట్డోస్, సెకండ్ డోస్లు కలిపి 16.21 లక్షల మందికి టీకాలు వేసినట్లు అధికారులు చెబుతున్నారు. జోన్ పరిధిలో 16 కేంద్రాలలో టీకా ప్రక్రియ కొనసాగుతుండగా.. వార్డుకొకటి చొప్పున 22 వార్డులలో 22 మొబైల్ వ్యాక్సినేషన్ టీమ్లు పనిచేస్తున్నాయి. వార్డుల వారీగా నోడల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో 314 బృందాలు కాలనీలు బస్తీలలో ప్రతిరోజూ ఇంటింటి సర్వే చేస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారి వివరాలను, వ్యాక్సిన్ వేసుకోని వారి వివరాలను సేకరిస్తున్నారు. సర్వే చేసిన ఇంట్లో అందరూ వ్యాక్సిన్ వేసుకుంటే ఆ ఇంటికి స్టిక్కర్ను అంటిస్తున్నట్లు ఆమె తెలిపారు.