కొన్ని రకాల ఆహార పదార్థాలు విరుద్ధ లక్షణాలను కలిగి ఉంటాయి. కలిపి తింటే.. నెగెటివ్ ప్రభావాన్ని కలిగించవచ్చని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అంతేకాదు, కొన్ని పదార్థాలను తినకూడని వేళల్లో తినడమూ మంచిది కాదని చెబుతారు. ఉదాహరణకు.. పెరుగు ఆరోగ్యానికి మంచిదే. కానీ, రాత్రివేళ తీసుకోవద్దు. ప్రసిద్ధ ఆయుర్వేద గ్రంథం ‘చరక సంహిత’ శిశిర, గ్రీష్మ, వసంత రుతువులలోనూ పెరుగు తినకూడదని చెబుతుంది.
పాలు- చేపలు
పాలు, చేపలను కలిపి తినకూడదు. పాలు చలువ చేస్తే, చేపలు వేడిని కలిగిస్తాయి. రెంటిని కలిపి తింటే ఆ ప్రభావం రక్తం మీద పడుతుంది. పాలు, ఉప్పు కూడా విరుద్ధ గుణాలు కలిగినవే.
అరటిపండు-పాలు
అరటిపండును పాలు, పెరుగు, మజ్జిగతో కలిపి తినకపోవడం ఉత్తమం. తింటే మాత్రం అరుగుదల మందగిస్తుంది. శరీరంలో హానికర రసాయనాలు విడుదల అవుతాయి. జలుబు, దగ్గు, అలర్జీలు కలుగుతాయి.
తేనె-నెయ్యి
వేడి చేసిన తేనెను తీసుకోవడం వల్ల జీర్ణ క్రియకు ఉపకరించే ఎంజైములు దెబ్బతింటాయి. సమాన పరిమాణంలో తేనె, నెయ్యి కూడా కలిపి తీసుకోవద్దు. రెంటినీ కలిపి తినాలనుకుంటే ఏదో ఒకదాన్ని ఎక్కువగా కలుపుకోవడం మంచిది.