నల్లనివాడు.. పద్మనయనంబులవాడు.. మహా శుగంబులున్ విల్లును దాల్చువాడు.. గడు విప్పగు వక్షమువాడు.. అంటూ పోతనామాత్యుడు పరమాత్మ రూపవర్ణన చేస్తాడు శ్రీమద్భాగవతంలో. ఆ మహాకవి కనుక సిద్దిపేట జిల్లా, ధూళిమిట్ట మండలం జాలపల్లిలో వెలసిన శ్రీకృష్ణుడిని దర్శించుకొని ఉంటే.. గుబురు మీసములవాడు, గుంభనపు నవ్వులవాడు అనీ కీర్తించేవాడేమో. ఎందుకంటే, జాలపల్లి స్వామికి నిమ్మకాయలనునిలబెట్టేంత స్థాయిలో మీసాలున్నాయి. అంతేకాదు, ఏ కృష్ణాలయంలో అయినా స్వామి.. రుక్మిణమ్మతోనో, సత్యభామా సహితంగానో దర్శనమిస్తాడు.
ఇక్కడ మాత్రం గోపికా వల్లభుడై కనువిందు చేస్తున్నాడు. పదహారువేలమందికి ప్రతినిధులుగా ఇద్దరు గోపెమ్మలు స్వామి చెంతనే కనిపిస్తారు. రేపల్లెలోని ఆలమందకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు రెండు గోవులూ ఉంటాయి. మలి కాకతీయలు శైవులు. శివుణ్ని ఆరాధించారు. శివాలయాలు కట్టించారు. జాలపల్లిలో మాత్రం శివాలయంతో పాటు పక్కనే వేణుగోపాల స్వామి గుడినీ నిర్మించారు. ప్రస్తుతం శివాలయం శిథిలమైపోయింది. అందులోని లింగాన్ని సమీప గ్రామస్తులు తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది. దీంతో మీసాల వేణుగోపాలుడు మాత్రం మిగిలాడు. ఈ స్వామిని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ కృష్ణాష్టమి, రామనవమి ఘనంగా నిర్వహిస్తారు.
‘మా గ్రామంలోని పురాతన వేణుగోపాల స్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతానికి మేమే ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నాం. దేవాదాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించి జీర్ణావస్థలో ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించాలి. నిత్యపూజలకు సౌకర్యం కల్పించాలి’ అని కోరుతున్నారు గ్రామ సర్పంచ్ చొప్పరి వరలక్ష్మీసాగర్.