YS Sharmila | మహిళా బిల్లుపై రంగులు మార్చడంలో ప్రధాని మోదీ అభినవ ఊసరవెల్లి అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. నారీ రిజర్వేషన్ల ముసుగులో డీ లిమిటేషన్ బిల్లు తెచ్చిన కపట సూత్రధారి అని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై ప్రధాని పెట్టేవి పెడబొబ్బలు అని అన్నారు .
మహిళా శక్తిని అడ్డుకున్నారని బీజేపీ కార్చేది ముసలి కన్నీరు అని విమర్శించారు.33 శాతం రిజర్వేషన్ల అమలుకు అసలు ద్రోహి మోదీజీ నే అని అన్నారు. 2023 లో ఆమోదం పొందిన బిల్లును అమలు చేయకుండా, మళ్లీ పార్లమెంట్ ముందుకు సవరణ బిల్లు తెచ్చి, దానికి పునర్విభజనతో లింక్ పెట్టి, ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని బీద ఏడుపులు ఎందుకు ? అని ప్రశ్నించారు. మహిళలను మన్నించమని అడగడం ఎందుకు ? అని నిలదీశారు. రాజకీయ స్వలాభం కోసం విపక్షం మీద శాపనార్థాలు పెట్టడం ఎందుకు ? అని ప్రశ్నించారు.
ప్రధాని మోదీకి 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే, మహిళల ఆత్మగౌరవం మీద పట్టింపు ఉంటే..
– Nari Shakti Vandan Adhiniyam -2023 “ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి.
– డీ లిమిటేషన్ తో సంబంధం లేకుండా 543 పార్లమెంట్ స్థానాలకు మహిళా రిజర్వేషన్లు పాటించాలి.
– 33 శాతం మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది.
– నియోజకవర్గాల పునర్విభజన శాస్త్రీయంగా జరగాలి.
– 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి రావాలి.
– కులగణన ద్వారా SC, ST, OBC ల జనాభా సంఖ్య తేలాలి.
– కులాల ఆధారంగా డీ లిమిటేషన్ లో రిజర్వేషన్లు పాటించాలి.
– వెనుకబడిన కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి న్యాయం చేయాలి.
– చిన్న రాష్ట్రాల వాదనలను పరిగణనలోకి తీసుకొని ఆమోదమైన పరిష్కారం చూపాలి.
– 2029 ఎన్నికల్లోపు దమ్ముంటే ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. అని డిమాండ్ చేశారు.
శాశ్వత అధికారం కోసం రాజ్యాంగాన్ని మార్చే కుతంత్రాన్ని అడ్డుకోవడంలో విపక్షానిది విజయమైతే, ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు మహిళలను అడ్డుపెట్టి మోదీ మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు అని షర్మిల విమర్శించారు. అధికారిక గణాంకాలు లేకుండా 50 శాతం పెంచి దేశాన్ని ఉద్ధరిస్తామంటే, 2029 ఎన్నికల్లో బీజేపీ లాభం కోసం రాష్ట్రాల సమైక్యతను దెబ్బ తీయాలని చూస్తే విపక్షం చెప్పేది ప్రతిసారి ఇదే గుణపాఠమేనని స్పష్టం చేశారు. మోదీకి మత పిచ్చి అని అన్నారు. చేతనైతే వెంటనే మహిళా రిజర్వేషన్లు అమలు చేసి చూపించాలని ఎన్డీయే పక్షాలకు సవాలు విసిరారు. శాస్త్రీయ పద్ధతిలో నియోజకవర్గాల పునర్విభజన చేయాలని డిమాండ్ చేశారు.