చెన్నారావుపేట, నవంబర్ 28: భద్రతా కారణాల దృష్ట్యా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రను అడ్డుకొని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన పాదయాత్ర సందర్భంగా షర్మిల సీఎం కేసీఆర్తోపాటు స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోమవారం పాదయాత్ర మగ్దుంపురంలో ప్రారంభమై చెన్నారావుపేటకు చేరుకోగా అక్కడ కూడా షర్మిల.. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారు. షర్మిల వ్యాఖ్యలను ఖండిస్తూ టీఆర్ఎస్ నాయకులు ఆమె ఫ్లెక్సీలను తగలబెట్టారు. శంకరంతండా శివారులో ఆమె కారవాన్పై పెట్రోల్ చల్లి నిప్పంటించారు. షర్మిల అనుచరులు వారిని అడ్డుకొని మంటలు ఆర్పివేశారు. లింగగిరి ఎక్స్రోడ్ వద్దకు వందలాదిగా చేరుకున్న టీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. వారందరూ అక్కడే ధర్నా చేపట్టారు. షర్మిల గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏసీపీ సంపత్రావు లా అండ్ ఆర్డర్ సమస్య ఉన్నదని వారెంట్ జారీ చేసి షర్మిలను అరెస్ట్టు చేయాల్సిందిగా పోలీసులకు తెలిపారు. పోలీసులు షర్మిలను అరెస్టు చేసి పోలీసు వాహనంలో వరంగల్కు తరలించారు.