నకిరేకల్, జూన్ 21: ఓ యువకుడి కళ్లల్లో కారం కొట్టి.. గడ్డి చెక్కే పారతో శరీరంలోని అన్ని భాగాలను చెక్కి, మర్మాంగాలను మెలేసి, శరీరంపై పిడిగుద్దులు గుద్ది అనంతరం చెట్టుకు కట్టేసి కాళ్లు విరగ్గొట్టి హతమార్చిన దారుణ ఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోములలో చోటుచేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింగ్ జానయ్య(34) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ తన తల్లితో నోముల గ్రామంలో జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ధనమ్మ అనే వివాహితతో జానయ్యకు 8 సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉంది.
ఈ విషయమై ఇరుకుటుంబాల మధ్య పలుమార్లు గొడవలు జరిగి పోలీస్ స్టేషన్ వరకూ పంచాయితీ వెళ్లింది. గత సంవత్సరం అక్టోబర్లో ధనమ్మ, నాగరాజు దంపతులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో జానయ్య అరెస్టయి జైలుకి వెళ్లి వచ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం జానయ్య.. ధనమ్మ ఇంటికి వెళ్లగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ధనమ్మ కూతురు తండ్రికి ఫోన్ చేయడంతో నాగరాజు ఆవేశంతో ఇంటికి వచ్చాడు. నాగరాజు, ధనమ్మతో పాటు కూతురు, ధనమ్మ తల్లి కలిసి జానయ్యను వారి ఇంట్లోనే విచక్షణా రహితంగా కొట్టారు. మర్మాంగాలను మెలిపెట్టి, ఛాతిపై పిడిగుద్దులు గుద్ది, పారతో శరీర భాగాలను చెక్కి వారి ఇంటి ముందున్న చెట్టుకు కట్టేసి, కళ్లల్లో కారంకొట్టారు.
మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల వరకూ జానయ్యను విచక్షణారహితంగా కొట్టడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. జానయ్య బంధువులు వచ్చి అంబులెన్స్లో నకిరేకల్ దవాఖానకు తరలించగా పరిస్థితి విషమంగా ఉందని, నల్లగొండ దవాఖానకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జానయ్యను నల్లగొండ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి 7.40 గంటలకు మృతిచెందాడు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ధనమ్మ, నాగరాజు నకిరేకల్ పోలీస్ స్టేషన్కు వచ్చి తామే జానయ్య కొట్టామని చెప్పి పోలీసులకు లొంగిపోయారు.
శనివారం నల్లగొండ డీఎస్పీ కార్యాలయంలో ధనమ్మ, నాగరాజు సరెండర్ అయినట్టు సమాచారం. జానయ్య తల్లి నర్సింగ్ ప్రమీల ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రాజశేఖర్ తెలిపారు. ప్లాట్ల బేరం చేసి తన కొడుకు సంపాదించిన డబ్బు మొత్తం ధనమ్మ వాడుకుందని, ఎనిమిదేళ్ల పాటు ఆగం చేసి, ఇప్పుడు దారుణంగా కొట్టి చంపారని, తనకు దిక్కెవరంటూ తల్లి ప్రమీల గుండెలు బాదుకుంటూ రోదించింది. తన కొడుకును చంపినవారిని కఠినంగా శిక్షించి, తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది.