అందరిలా ఆ యువరైతు ఆలోచించలేదు.. వరి వద్దనుకొన్నడు.. కూరగాయల సాగుకు మొగ్గు చూపిండు.. అందులోనూ బోడకాకర భలేగుంటదని సోంచాయించిండు.. ఆ ఆలోచనతో పెట్టుబడి తగ్గింది, గిట్టుబాటు పెరిగింది. పంట అమ్ముడుపోతదా! అన్న బెంగ లేకుండా డిమాండ్ కలిసొచ్చింది, వ్యాపారులే వచ్చి లైన్ కట్టిండ్రు. ఇంకేంది.. లాభం కూడా మస్తుగొచ్చింది.
జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): వ్యాపారాన్ని వదిలిపెట్టి వ్యవసాయం చేస్తూ మంచి లాభాలు దక్కించుకొంటున్నాడు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కుందూరుపల్లికి చెందిన యువరైతు నాడెం సతీశ్. వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు, తీసుకొంటున్న చొరవ అతడిని వ్యవసాయం వైపు మళ్లించింది. తాను చేస్తున్న ఎలక్ట్రికల్, ఐరన్ అండ్ హార్డ్వేర్ వ్యాపారాన్ని కూడా వదిలేసి, వ్యవసాయంపై దృష్టిపెట్టాడు. సంప్రదాయ వ్యవసాయానికి భిన్నంగా కూరగాయల సాగును ఎంచుకొన్నాడు. నాలుగున్నర ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలను సాగుచేయాలని నిర్ణయించుకొన్నాడు. గతంలో కాకర, బీర వంటి తీగ జాతి కూరగాయలు సాగు చేశాడు. ప్రస్తుతం రెండు ఎకరాల్లో బోడకాకర సాగు చేస్తున్నాడు. ఈ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని గుర్తించి.. విత్తనాలను ఖమ్మం నుంచి తెప్పించాడు. కిలోకు రూ.5 వేల చొప్పున 8 కిలోల విత్తనాలు కొన్నాడు.
రూ.5 లక్షలతో క్షేత్రం
తీగ జాతి కూరగాయలను సాగు చేసేందుకు రెండెకరాల్లో 450 రాతి కణీలను వేశాడు. ఒక్కోదానికి మధ్య 15 ఫీట్ల దూరం ఉండేలా పాదులు తవ్వి అడ్డు, నిలువుగా ఇనుప తీగలు అమర్చాడు. దీనికి మొత్తం రూ.5 లక్షలు ఖర్చు చేసినట్టు సతీశ్ చెప్పాడు.
మార్కెటింగ్ సులువు
మార్కెట్లో డిమాండ్ ఉన్న కూరగాయల్లో బోడకాకర ఒకటి. ఆ డిమాండే అతడి వద్దకు తరలివచ్చింది. వ్యాపారులే వ్యవసాయ క్షేత్రం వద్దకు వచ్చి హోల్సేల్గా కొంటున్నారు. దీంతో సతీశ్కు మార్కెటింగ్ సమస్య లేకుండా పోయింది. మూడేండ్ల దాకా ఆదాయానికి ఢోకా లేకుండా పోయింది. బోడకాకర సాగుచేసే వ్యవసాయ క్షేత్రంలో అంతర పంటలను కూడా సాగు చేసి, అదనపు ఆదాయం పొందవచ్చు.
విత్తనం నేనే తయారు చేస్తున్నా
ఇంతకుముందు ఖమ్మం నుంచి బోడకాకర విత్తనాలు కొనేది. ఇప్పుడు నా భూమిలో సాగుచేసిన పంట నుంచి విత్తనాలను తయారు చేస్తున్నా. ఈ ప్రాంతంలో సాగుచేయాలనుకొనేవారికి అందుబాటులో ఉంచుతున్నా. సాగుచేయటం సులభం. ఒకసారి సిమెంట్, రాతి స్తంభాలు నాటి, ఇనుప తీగలను లాగితే చాలు. విత్తనాలు నాటే సమయంలో జీవామృతం, శిలీంధ్రాలు, జీవసంబంధ ఎరువులు వేయాలి. మొక్కలు మొలిచిన తర్వాత వేపనూనె, గానుగ నూనె పిచికారీ చేయాలి. పచ్చ పురుగులు సోకకుండా అట్టలు వాడాలి.
25 రోజుల్లో మొలకెత్తుతాయి
సాధారణంగా బోడకాకర విత్తనాలను మే నెలలో నాటాలి. 25 రోజుల్లో మొలకెత్తుతాయి. నాటిన 100 గింజల్లో కేవలం 10 మాత్రమే మొలుస్తాయి. ఇందులో ఆడ, మగ రకాలను పూలు పూసే సమయంలో వేరు చేయాల్సి ఉంటుంది. మొలకెత్తిన విత్తనాలలో 8 ఆడ మొక్కలకు, 2 మగ మొక్కలను ఉంచి ఎక్కువగా ఉన్న మగ చెట్లను తీసివేయాలి. చలికాలంలో దిగుబడి ఎక్కువ వస్తుంది. రెండెకరాల్లో సాగుచేసిన బోడకాకరలో ప్రస్తుతం వారానికి ఒకసారి 20 కిలోల వరకు కాయలు తెంపి మార్కెట్లో విక్రయిస్తున్నాడు. ఒక్కసారి పంట వేస్తే మూడేండ్ల వరకు కాత వస్తుంది.
బోడకాకరకాయతో లాభాలు: