బన్సీలాల్పేట్, నవంబర్ 17: అతడో యువడాక్టర్.. పట్టుమని ముప్పై ఏండ్లు కూడా నిండలేదు.. ఎన్నో గుండెల్ని రక్షించిన ఆ యువకుడి గుండెపై మృత్యురాకాసి పోటు వేసింది. హార్ట్ అటాక్తో అతడిని బలితీసుకొన్నది. వచ్చే నెలలో నిశ్చితార్థం చేసుకోవాల్సిన వ్యక్తి అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఏపీలోని గుంటూరు జిల్లా నిజాంపేటకు చెందిన డాక్టర్ పూర్ణచంద్ర(28) పెదకాకానిలోని ఎన్నారై మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివాడు. నీట్ పాసై గాంధీ మెడికల్ కాలేజీలో పీజీ పూర్తి చేశాడు. ఇక్కడే సర్జరీ విభాగంలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్గా ఏడాదిపాటు సేవలు అందించాడు. పద్మారావునగర్లో రూమ్లో ఉంటూ స్పెషలైజేషన్ కోసం చదువుతున్నాడు. వచ్చే నెలలో ఉన్న తన నిశ్చితార్థానికి ఆహ్వానించేందుకు బుధవారం గాంధీ దవాఖాన హాస్టల్లో ఉండే స్నేహితుల వద్దకు వచ్చాడు. దవాఖానకు రాగానే ఛాతిలో నొప్పి రావటంతో గ్యాస్ రిలీజ్ కోసం ఇంజెక్షన్ తీసుకొని, పై అంతస్థులో హాస్టల్ గదివైపు నడుచుకుంటూ వెళ్తుండగా మెట్ల వద్ద కుప్పకూలిపోయాడు. సహచరులు వచ్చి చూసేసరికే అతడు మృతిచెందాడు. చిన్నవయసులోనే డాక్టర్ చనిపోవటం తోటి వైద్యులు, దవాఖాన సిబ్బందిని తీవ్రంగా కలిచివేసింది. ఆరు నెలల క్రితం గుండె సంబంధిత చికిత్స కూడా తీసుకొన్నాడని వారు తెలిపారు. పూర్ణచంద్ర మరణవార్త తెలియగానే దవాఖానకు వచ్చిన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు, ఆర్ఎంఓలు, పలు విభాగాల వైద్యులు మృతదేహానికి నివాళి అర్పించారు. ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన యువ డాక్టర్ను కోల్పోవటం పట్ల తమ సంతాపాన్ని తెలిపారు. పూర్ణచంద్ర గుండెపోటుకు ప్రత్యేక కారణాలేవీ తెలియరాలేదని, కుటుంబ నేపథ్యం కారణంగా గుండెపోటు వచ్చే అవకాశాలు అధికమని, ఈ క్రమంలోనే అతడికి హార్ట్ అటాక్ అయ్యి ఉండవచ్చని డాక్టర్ రాజారావు పేర్కొన్నారు. నగరంలో నివసించే బంధువులు, సహచర వైద్య విద్యార్థులు మృతదేహాన్ని అంత్యక్రియల కోసం అంబులెన్స్లో స్వగ్రామానికి తీసుకెళ్లారు.