సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్ఇండియా ముఖచిత్రం మారనుంది. దశాబ్దానికి పైగా జట్టులో కీలకమైన చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహా స్థానాల్లో.. శుభ్మన్ గిల్, హనుమ విహారి, మహమ్మద్ సిరాజ్, రిషబ్ పంత్ దర్శనమివ్వనున్నారు. వరుసగా విఫలమవుతున్న సీనియర్లను లంకతో సిరీస్కు పక్కన పెట్టిన యాజమాన్యం.. యువ ఆటగాళ్లను తీర్చిదిద్దాలని భావిస్తున్నది. మరి వీరిలో అంచనాలు అందుకునేదెవరో వేచి చూడాలి!
న్యూఢిల్లీ: దశాబ్ద కాలంగా మిడిలార్డర్లో మూలస్తంభాలుగా మెలిగిన చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే లేకుండా లంకతో టెస్టు సిరీస్ బరిలోకి దిగనున్న టీమ్ఇండియా.. జట్టుకు యువరక్తాన్ని ఎక్కించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఓపెనర్గా జట్టులోకి వచ్చి విలువైన ఇన్నింగ్స్లు ఆడిన శుభ్మన్ గిల్ను మూడో స్థానంలో.. హైదరాబాద్ రంజీ ప్లేయర్ హనుమ విహారిని ఆరో స్థానంలో నిలదొక్కుకునేందుకు వీలైనన్ని అవకాశాలు ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తున్నది. దక్షిణాఫ్రికా సిరీస్లో ఘోర పరాజయం అనంతరం విరాట్ కోహ్లీ.. సుదీర్ఘ ఫార్మాట్ కెప్టెన్సీకి వీడ్కోలు పలుకగా.. రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్గా తన ప్రస్థానం ప్రారంభించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్గా పగ్గాలు అందుకున్న తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లో యువ ఆటగాళ్లకు విరివిగా అవకాశాలు ఇస్తున్న హిట్మ్యాన్.. సంప్రదాయ ఫార్మాట్లోనూ ఇదే కొనసాగించే ఆలోచనలో ఉన్నాడు. సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కెరీర్ ముగిసినట్లే అని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేయగా.. రిషబ్ పంత్కు తోడు తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ను జట్టుకు ఎంపిక చేశారు. దీంతో మిడిలార్డర్లో యంగ్ జోష్ ఎక్కువ కనిపిస్తున్నది. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ కూడా ఇక జట్టులోకి తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అతడి స్థానాన్ని హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ భర్తీ చేసినట్లే. పొట్టి సిరీస్లో హ్యాట్రిక్ హాఫ్సెంచరీలతో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్ను రిజర్వ్ ఆటగాడిగా చూడనున్నారు. శుక్రవారం నుంచి మొహాలీ వేదికగా శ్రీలంకతో ప్రారంభం కానున్న తొలి టెస్టులో రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేయడం ఖాయం కాగా.. ఆ తర్వాత వరుసగా గిల్, కోహ్లీ, పంత్, విహారి, జడేజా బ్యాటింగ్కు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టెస్టు అరంగేట్రానికి ముందే శుభ్మన్ గిల్ మిడిలార్డర్లో ఆడేందుకు సిద్ధమైనట్లు జాతీయ మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ పేర్కొన్నాడు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో మూడో స్థానానికి శుభ్మన్ ఎంపిక సరైనదే. వెస్టిండీస్లో పర్యటిస్తున్న సమయంలో భారత్-ఏ తరఫున మిడిలార్డర్లో బరిలోకి దిగిన గిల్ డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇప్పటికే ఓపెనర్గా ఆడిన అనుభవం ఉండటంతో మూడో స్థానంలో దిగడం అతడికి పెద్ద కష్టం కాదు. కొత్త బంతిని ఎదుర్కోవాల్సి వచ్చినా ఇబ్బంది పడడు’ అని అన్నాడు. అలాగే రహానే బరిలోకి దిగే ఐదో స్థానంలో హనుమ విహారికి బదులు రిషబ్ పంత్ను పంపడమే ఉత్తమమని దేవాంగ్ అభిప్రాయపడ్డాడు. ‘టాపార్డర్లోని నలుగురు (రోహిత్, మయాంక్, గిల్, కోహ్లీ) ఆటగాళ్లు కుడి చేతి వాటం వాళ్లే కావడంతో.. లెఫ్టామ్ బ్యాటర్ రిషబ్ పంత్ను ఐదో స్థానంలో దింపడం మేలు. ఆ తర్వాత విహారి వస్తే కుడి ఎడమ కూర్పు బాగుంటుంది’ అని దేవాంగ్ వివరించాడు.