మరికల్, జూలై 17: మహబూబ్నగర్ జిల్లా మరికల్ మండలంలోని పసుపుల కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో గురువారం రాత్రి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా బస చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించారు. పలు పాఠ్యాంశాలపై విద్యార్థులను ప్రశ్నించి విద్యార్థుల నుండి సరైన జవాబు రావడం పట్ల విద్యార్థులను అభినందించారు. కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఉన్నత స్థాయిలో నిలిచే విధంగా ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులతో కలిసి గురువారం ఉదయం అల్పాహారాన్ని స్వీకరించారు.
అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురుని ఆకట్టుకున్నాయి. పాఠశాల కార్యదర్శి కేజీబీవీలో బస చేసి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. విద్యార్థులు పాఠశాల కార్యదర్శి అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబులు చెప్పడం పట్ల విద్యార్థులను దగ్గర తీసుకొని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని అభినందించారు.
ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, జాయింట్ డైరెక్టర్లు వెంకట నరసమ్మ, మదన్, ఆర్జెడి విజయలక్ష్మి, రాష్ట్ర జిసిడిఓ శిరీష, జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, జి సి డి ఓ నర్మదా, తాసిల్దార్ రామకోటి, ఎంపీడీవో కొండన్న, ఎంపీ ఓ పావని, పాఠశాల ఎస్ఓ రాజ్యలక్ష్మి, ఆర్ఐ సుధాకర్ రెడ్డి, ఏ ఎం ఓ విద్యాసాగర్, సెక్టోరియల్ ఆఫీసర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.