ఢిల్లీ సరిహద్దులకు తరలుతున్న వేలాది రైతులు
చండీగఢ్, నవంబర్ 25: మోదీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు సాగిస్తున్న చారిత్రక మహోద్యమానికి శుక్రవారంతో ఏడాది పూర్తవుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కేసులు బనాయించినా, రైతుల్లో చీలికలు తేవాలని ప్రయత్నించినా, ఆఖరుకు కార్లతో తొక్కించి పలువురి ప్రాణాలు బలితీసుకున్నా.. రైతులు బెదరలేదు. ఎండ, చలి, వానలను సైతం లెక్కచేయకుండా మొక్కవోని దీక్షతో పోరు సాగిస్తున్నారు. అధికారికంగా చట్టాలు రద్దయ్యే వరకు తమ ఆందోళన విరమించేది లేదని ప్రతినబూనారు. ఇదే సమయంలో కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించాలని, విద్యుత్ సవరణ బిల్లును వెనక్కు తీసుకోవాలని, రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు పలు డిమాండ్లను కేంద్రం ముందుంచారు.
డిమాండ్లు పరిష్కరించేదాకా..
ఉద్యమానికి ఏడాది అయిన సందర్భంగా ఢిల్లీ సరిహద్దులతో పాటు ఇతర రాష్ర్టాల రాజధానులు, జిల్లా కేంద్రాల్లో రైతులు సభలు, సమావేశాలు, అమరులైన రైతులకు నివాళి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హర్యానా, పంజాబ్తో పాటు పలు రాష్ర్టాల నుంచి వేలాది రైతులు ఢిల్లీ సరిహద్దులకు తరలివెళ్తున్నారు.
రైతులకు మద్దతుగా ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం
రైతులకు మద్దతుగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో తీర్మానం చేయనున్నది. దీని ద్వారా ఉద్యమంలో అమరులైన 700 మందికి పైగా రైతులకు పరిహారం అందించాలని, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని, లఖింపూర్ ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్మిశ్రాను అరెస్టు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయనున్నది.