కోల్కతా: కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. అదేవిధంగా టీఎంసీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా పార్టీ అధినాయకత్వం నియమించింది. మాజీ ప్రధాని వాజ్పేయి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన గత శనివారం టీఎంసీలో చేరిన విషయం తెలిసిందే. 83 ఏళ్ల యశ్వంత్ సిన్హా.. 2018లో బీజేపీకి స్వస్తి పలికారు. అయితే ఆయన కుమారుడు జయంత్ సిన్హా మాత్రం బీజేపీలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన జార్ఖండ్లోని హజారీబాగ్ నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
కాగా, అసెంబ్లీ ఎన్నికలకు ముందే బెంగాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సీఎం మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గాన్ని వదిలిపెట్టి నందీగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే టీఎంసీలో కీలకనేత అయిన సువేందు అధికారి గతేడాది ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన నందీగ్రామ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఎనిమిది దశల్లో సాగనున్న బెంగాల్ అసెంబ్లీ ఫైట్.. ఈసారి మహారసవత్తర పోరును తలపిస్తున్నది.