యాచారం, డిసెంబర్ 12: రాష్ట్రంలో ఇటీవలి కాలంలో నీటివనరులు పెరుగడంతో వానకాలంలో వరి ధాన్యం సాగు విస్తీర్ణం భారీ గా పెరిగినది. తెలంగాణ రా ష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2014-15లో 34.92 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తే 2020-21లో ఏకంగా కోటీ6 లక్షల ఎకరాలకు చేరిం ది. వరి పంట సాగు తర్వాత తిరిగి మళ్లీ వరినే సాగు చేయడం ద్వారా భూసారం తగ్గి ఆశించిన స్థాయిలో దిగుబడి రాదు. అందువల్ల రైతులు భూసారాన్ని పెంపొందించే పంటలను సాగు చేయాలి. కేంద్ర ప్రభుత్వం దొడ్డు ధాన్యాన్ని యాసంగి సీజన్లో కొనుగోలు చేయబోమని తేల్చి చెప్పడంతోపాటు, మార్కెట్లో రైతులకు ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని ప్రభుత్వం గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి సూచిస్తున్నది. పప్పుదినుసులు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూ రగాయలు, అంతర పంటలను సాగు చేస్తే రైతులకు అధిక దిగుబడితోపాటు లాభాలు వస్తాయని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఆరుతడి పంటల సాగులో భాగంగా పొద్దు తిరుగుడు పం టను కూడా యాసంగిలో కొద్దిపాటి నీటి వనరులతో తక్కువ కాలపరిమితి గల పంటగా సాగుచేసి అధిక దిగుబడిని పొందొచ్చని వ్యవసాయాధికారి సందీప్కుమార్ సూచిస్తున్నారు. ఆయన సూచనలు ఇలా…
నేలలు
నీరు నిల్వ ఉండని ఎర్ర చల్కా, ఇసుక, ఒండ్రు మట్టి నేలలు పొద్దుతిరుగుడు పంట సాగుకు అనుకూలమైనవి.
విత్తే సమయం
పొద్దుతిరుగుడు పంట సాగుకు విత్తనాలను నవంబర్ 1 నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు విత్తవచ్చు. వేసవిలో జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 తేదీ వరకు రెండు దఫాలుగా పంటను రైతులు సాగు చేసుకోవచ్చు.
మేలైన విత్తనాలను ఎంచుకోవాలి
పొద్దుతిరుగుడు పంట సాగు కోసం మేలైన విత్తనాలను ఎంచుకోవాలి. ఇందులో హైబ్రిడ్ రకాలు కేబీఎస్హెచ్-44, ఎన్డీఎస్హెచ్-1, డీఆర్ఎస్హెచ్-1, కేబీఎస్హెచ్-78 రకాలు నాణ్యమైనవిగా చెప్పవచ్చు. మేలి రకం విత్తనాలతో పంటను సాగు చేస్తే అధిక దిగుబడులు పొందొచ్చు.
విత్తన మోతాదు
పొద్దు తిరుగుడు సాగులో విత్తన మోతాదును సక్రమంగా చేపట్టాలి. ఎకరాకు 2.5-3.0 కిలోల విత్తనాలు అవసరం. విత్తన మోతాదు ప్రక్రియతో పంట దిగుబడి పెరుగడంతోపాటు లాభాలు కూడా వస్తాయి.
విత్తన శుద్ధి
పొద్దు తిరుగుడు సాగులో విత్తన శుద్ధి ఎంతో ముఖ్యమైనది. నెక్రోసిస్ అనే తెగులు సమస్యను అధిగమించేందుకు థయోమిథాక్సామ్ 3గ్రాములు, ఇమిడా క్లోప్రిడ్ 5.0 మి.లీ ఒక కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసుకోవాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు మందులు వాడాలి.
విత్తే విధానం
ఈ పంట సాగులో భాగంగా బోదెలు చేసి విత్తనాన్ని నాటాలి. పంటకాలంలో వివిధ దశల్లో నీటిని పంటకు అందించేందుకు, ఎరువులు వేసేందుకు బోదెలు దోహదపడుతాయి.
విత్తే దూరం
తేలిక నేలల్లో 45 సెం.మీ నుంచి 20-25 సెం.మీ, నల్లరేగడి నేలల్లో 60సెం.మీ నుంచి 30 సెం.మీల దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తనం మొలకెత్తిన 10 నుంచి 15 రోజుల తర్వాత కుదురుగా, ఆరోగ్యంగా మొక్కను ఉంచి మిగిలిన మొక్కలను తొలగించాలి.
నీటి యాజమాన్యం
నేలల స్వభావం, పగటి ఉష్ణోగ్రతలను బట్టి ఎర్రనేలల్లో 8 నుంచి 10 రోజుల వ్యవధిలో, నల్లరేగడి నేలల్లో 15 నుంచి 20 రోజుల వ్యవధిలో నీటి తడులు పెట్టాలి. మొగ్గ తొడుగు దశ, పువ్వు వికసించే దశ, గింజ కట్టే సమయం కీలక దశలు. కాలువలు, బోదెల పద్ధ్దతిలో నీరు ఇస్తే నీటి వృథా తగ్గుతుంది. అదేవిధంగా కలుపు మందును 600మి.లీటర్లు ఎకరం స్థలంలో విత్తిన 24 నుంచి 48 గంటల్లోపు తేమ గల నేలపై పిచికారీ చేయా లి. పంట విత్తిన 25 నుంచి 30 రోజుల తర్వాత గుంటుకతో అంతర సేద్యం చేయాలి.
పొద్దు తిరుగుడులో సస్యరక్షణ
దీపపు పురుగులు ఆశిస్తే చివర్లు పసుపు పచ్చగా మారి పూర్తిగా ముడుచుకుపోతాయి. వాతావరణంలో ఉష్ణోగ్రత లు 30 డిగ్రీల సెం.మీ కంటే ఎక్కువగా ఉంటే పైరు బెట్టకు గురైనప్పుడు నీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు మోనోక్రొటోపాస్ 1.6మి.లీ లీటరు నీటితో కలిపి పిచికారీ చేయాలి.
పొగాకు లద్దె పురుగు
పొగాకు లద్దె పురుగు ఆకులపై పత్రహరితాన్ని తినేస్తుంది. పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు 5 శాతం వేపగింజల కషా యం పిచికారీ చేసుకోవాలి. దీని నివారణకు నొవల్యురాన్ 200మి.లీ ఒక ఎకరాకు సరిపోయేలా 200మి.లీ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
తెల్ల దోమ
రసాన్ని పీలుస్తాయి. అంతేకాక పల్లాకు తెగులును వ్యాపింపజేస్తాయి. నివారణకు ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లీటరు నీటితో కలిపి పిచికారీ చేయాలి.
తామర పురుగు
పొద్దు తిరుగుడు పంటను తామర పురుగులు ఆశించినప్పుడు ఆకుల అడుగు భాగంలో గోధుమ/ఇనుప రంగుమచ్చలు ఏర్పడుతాయి. దీని నివారణకు థయోమిథాక్సామ్ 100 గ్రా. +1లీటరు వేపనూనె+1కిలో సబ్బు పొడిని 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి.
శనగ పచ్చ పురుగు
ఈ పురుగులు లేత ఆకులపైన, పువ్వులపై చేరి రంధ్రాలు చేస్తాయి. నివారణకు 1కిలో బీటీ ఫార్ములేషన్ లేదా 5శాతం వేపగింజల కషాయాన్ని పురుగులు చిన్న దశలో ఉన్నప్పుడే పిచికారీ చేయాలి. అదేవిధం గా ఆకుమచ్చ తెగులుతో ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి, ఆకులు మాడిపోయినట్లుగా అవుతాయి.
బూడిద తెగులు
ఈ తెగులుతో ఆకులపై, అడుగుభాగంలో బూడిద లాంటి పొడి కప్పబడి ఉంటుంది. వేడి వాతావరణంలో తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రబీలో నీటి పారుదల కింద సాగుచేసిన పంటపై ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు డైనోక్యాప్ 1మి.లీ లీటరు నీటితో కలిపి పిచికారీ చేయాలి.
పక్షుల బెడద
పొద్దు తిరుగుడు పంటకు ముఖ్యంగా రామచిలుకల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి రాక నివారణకు పైరును కనీసం సామూహికంగా 20-25 ఎకరాల్లో సాగు చేయాలి. మెరుపు రిబ్బన్లను పైరుపైన, అడుగు ఎత్తున సూర్యరశ్మి రిబ్బన్లపై పడేలా కట్టాలి. శబ్దాలు చేయడం, దిష్టి బొమ్మలను ఉపయోగించి పక్షులను పారదోలడంతో పంట అధిక దిగుబడిని పొందొచ్చు..
పైరుకోత
పొద్దు తిరుగుడు పువ్వు వెనుక భాగం నిమ్మపచ్చ రంగుకు మారిన తర్వాత పువ్వులను కోసి 2 నుంచి 3 రోజుల పాటు ఆరనివ్వాలి. ట్రాక్టర్ ద్వారా నడిచే నూ ర్పిడి యంత్రాలను ఉపయోగించి విత్తనాన్ని వేరుచేయాలి. గింజలో తేమ 9-10శాతం వచ్చే వరకు ఎండబెట్టాలి.
దిగుబడి
నీటి పారుదల కింద ఎకరాకు 800-900 కిలోల దిగుబడిని సాధించొచ్చు. ఇలా యాసంగిలో వరికి బదులుగా పొద్దుతిరుగుడు పంటను సాగు చేసి రైతులు అధిక లాభాలను పొందొచ్చు.