ఆధ్యాత్మిక, పౌరాణిక,చారిత్రక ధారావాహిక 51
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో యాదర్షి కొలిచిన యాదగిరీశుడిని దర్శించుకుని రాజధానికి తిరిగివస్తాడు త్రిభువనుడు. చుట్టూ కమ్ముకున్న యుద్ధమేఘాలను తొలగించే శక్తి శ్రీమత్ రామానుజాచార్యులకే ఉందని భావిస్తాడు విష్ణువర్ధనుడు. అదే జరిగింది.
రకరకాల చర్చలు, ఆలోచనలు, సంప్రదింపులు.. ఇలాంటివన్నీ జరుగుతుండగానే పరిస్థితి మారిపోతూ వచ్చింది. శ్రీలక్ష్మీనరసింహుడి భక్తుడైన భువనగిరి సామ్రాజ్యాధీశుడు త్రిభువనమల్లుడు యుద్ధ వాతావరణానికి సంసిద్ధంగా లేని సమయం అది. విష్ణువర్ధనుడు తన హొయసల హద్దులు దాటి, భువనగిరి రాజ్యానికి సంబంధించిన సరిహద్దు రక్షణ దుర్గాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ దుర్గాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భువనగిరి మహాసేనాని అనంతపాలుడు చాలా రకాలుగా ప్రతిఘటన కొనసాగించాడు. కానీ, లాభం లేకపోయింది.
రాణి చంద్రలేఖాదేవికి అందిన సమాచారం మేరకు విష్ణువర్ధనుడు తన మిత్రరాజులను కూడా కలుపుకొని, సర్వసైన్యాలతో వస్తున్నాడని.. అతడే గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని!
మరొక ముఖ్యవిషయం ఏమిటంటే..
విష్ణువర్ధనుడు ఒక అభిప్రాయాన్ని వేగులద్వారా చుట్టుపక్కల రాజులందరికీ చేరవేశాడు.
త్రిభువనమల్లుడు పోరాటపటిమను పూర్తిగా విస్మరించాడనీ, మరిచిపోవడమే కాక దైవభక్తిలో లీనమైపోయాడనీ, యుద్ధంలో గెలవడం దేవుడెరుగు.. కత్తిపట్టి నిలబడటం కూడా కష్టమేనని!
విష్ణువర్ధనుని సిద్ధాంతం ప్రకారం..
రాజ్యాన్నేలే రాజుకు ఉండాల్సింది శక్తి కానీ, భక్తి కాదు!
ఇంతకాలం త్రిభువనమల్లుడికి సామంతుడిగా ఉన్న తాను, ఇప్పుడు త్రిభువనమల్లుడినే సామంతుడిని చేసుకోగలడు, చేసుకుంటాడు.
విద్యాపతికీ ఈ విషయాలు తెలిశాయి. విద్యాపతి ముందుగా మహారాణి చంద్రలేఖను కలిసి.. ఈ విషయమై చర్చించాలనుకొన్నాడు.
కోటలో ఉన్న గుడికి మహారాణివారు వేంచేసి ఉన్నారన్న సమాచారంతో నేరుగా అక్కడికే వెళ్లాడు విద్యాపతి.
పూజా కార్యక్రమాలు ముగించుకున్న తదుపరి, మహారాణి వారిని కలిశాడు.
“మహారాణీ వారికి అభినందనలు” అన్నాడు వినయంగా.
విద్యాపతి మాటలు విని తలెత్తి చూసిందామె.
“మీకు కూడా విద్యాపతీ కవివరేణ్యా!” అన్నది చంద్రలేఖ.. ఏ భావమూ బయటపడకుండా.
“అమ్మా.. అభినందనలు నాకెందుకు?” అన్నాడు విద్యాపతి.
“మీరు మాకెందుకు చెప్పారో.. మేము కూడా మీకు అందుకే చెప్పాం. ఏది ఏమైనా, జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. పరిస్థితుల్ని ప్రభావితం చేయగల స్థానాల్లో ఉన్న మనం.. మౌన ప్రేక్షకుల్లా మిగిలిపోయాం. అందుకే విజయం ప్రాప్తించాలని పూజలు నిర్వహించాం. మనం చేయగల పని మరొకటి లేదు గనుక..” నిష్టూరంగా పలికింది మహారాణి స్వరం.
ముందు తలవంచుకున్నాడు విద్యాపతి, తక్షణమే ఏ విధంగా స్పందించాలో తెలియక.
తరువాత అన్నాడు.
“మన్నించండి అమ్మా! ప్రభువులవారు ఏది చెబితే అది చేయాలి మనం”.
“ఏమి చేయాలో వారు చెప్పకపోతే..” అన్నది మహారాణి.
విద్యాపతి మౌనం.
“ఏమీ చేయకుండా ఉండాలా?” రెట్టించింది మహారాణి.
“మరి వేరే మార్గమేముందమ్మా..?” అయోమయంగా పలికాడు.
“ఏం చేయాలో వారు చెప్పకపోతే, ఏం చేస్తే బాగుంటుందో మనం వినయంగా వారికి సూచించాలి. మన దగ్గరున్న సమాచారం, మన ఆలోచనలు, ప్రణాళికలు వారి దృష్టికి తీసుకెళ్లాలి. అదే మనం చేయవలసింది” చెప్పింది మహారాణి.
“అమ్మా.. మీరే వారికి ఒకమాట చెప్తే..” అన్నాడు.
“అయితే, ఇద్దరం చెప్దాం. మీరు కొద్ది వ్యవధి తరువాత ఆలోచనా మందిరానికి రండి” అని చెప్పి, వడివడిగా వెళ్లిపోయింది మహారాణి. చెలికత్తెలు వెంటరాగా.
త్రిభువనుడు దీర్ఘాలోచనలో ఉన్నాడు.
ఆయన కనుల ముందు ఒకటే దృశ్యం కనిపిస్తున్నది.
యాదర్షి కొండపైన గుహలో కొలువైన శ్రీలక్ష్మీనరసింహుడు.. ఒక అద్భుతమైన ఆలయ నిర్మాణం జరుగుతున్నది.
క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి వారు.
అదిగో.. ఉగ్రమూర్తిగా దర్శనమిస్తున్న చక్రత్తాళ్వారు. వెనుక యోగ నరసింహుడు.
అదిగో.. భక్తజనకోటి!
చాలా సేపటినుంచీ.. త్రిభువనమల్లుడు అదే మనఃస్థితిలో ఉన్నాడు.
“ప్రభూ!” నెమ్మదిగా పిలిచింది మహారాణి.
కనులు మూసుకొని ఉన్న త్రిభువనుడు కండ్లు తెరిచి చూశాడు.
“దేవీ!” అన్నాడు. ‘ఏమిటి?’ అన్నట్టుగా.
“ఏమీలేదు ప్రభూ.. రాజ్య సరిహద్దుల్లో రక్షణ కరువైంది. అంతటా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.
మీరు స్వామివారి అన్వేషణలో కొండపైన ఉన్న సమయంలోనే విష్ణువర్ధనుడికి ఈ దురాక్రమణ కాంక్ష కలిగింది. నేనే యుద్ధానికి వెళ్తానన్నాను మీ తరఫున. కానీ, అనంతపాల సేనాని వద్దన్నాడు. ‘ఆడవారి పని కుటుంబసభ్యుల ఆలనాపాలనా చూడటమే కానీ, యుద్ధరంగంలో కుత్తుకలు తెగ్గోయడం కాదు’ అన్నాడు. తనే సైన్యానికి సారథ్యం వహిస్తానని, విజయం సాధిస్తానని ప్రకటించుకున్నాడు. తను వెళ్లాలనే అవకాశం కోసం అలా అన్నాడని తెలుసు కనుక, నన్ను వద్దనడాన్ని నేను అవమానంగా భావించలేదు. అనుకున్నది ఒకటయితే, జరిగింది మరొకటి. తను కూడా ఓటమిపాలై, శత్రువుల ధైర్యాన్ని మరింత పెంచాడు..” అంటూ ఒక్క క్షణం ఆగింది.
ఆమె మాటలపైన పెద్ద ఆసక్తి చూపలేదు త్రిభువనుడు.
“సరే, ఇప్పుడేం చేద్దామంటావు.. దేవీ!” అన్నాడు.
ఆయన సాధారణ ప్రతిస్పందన చూసి, దిగ్భ్రాంతికి లోనైంది.
ప్రభువుల వీరత్వం, సాహసం, ప్రజా రక్షణా సంకల్పం ఏమైనాయి?
శత్రువు పేరు వింటేనే కండ్లలో నుంచి నిప్పులు కురిసేవి. ఆవేశం అగ్నిపర్వతంలా బద్దలై.. ఆదేశాలు వరుసగా, వేగంగా వదిలిన బాణాల్లాగా నోటివెంట దూసుకొచ్చేవి. ఏమి జరిగిందో.. ఏమి జరుగుతున్నదో.. ఏమి జరగనున్నదో.. తెలిసేలోగానే, శత్రుమూకల తలకాయలు కోటగుమ్మానికి తోరణాల్లా వేలాడేవి. శత్రుసైన్యాలు మట్టిలో కలిసిపోయేవి.
భగభగమండే నిప్పుల మీద నీళ్లు చల్లిందెవరు?
ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం.. నరాలను తెంపిందెవరు?
త్రిభువనమల్ల ప్రభువుల వారిని ఇలా మార్చివేసిందెవరు?
‘అయితే, ఇప్పుడేం చేద్దాం దేవీ!’ అని అంటూండగా ప్రవేశించిన విద్యాపతి.. మహారాణి వదనంలో ప్రతిఫలిస్తున్న అల్లకల్లోలాన్ని గమనించాడు.
“ప్రభువులకు జయము. ఇంతకాలం ప్రభువులే ఏమి చేయాలో, ఎలా చేయాలో ఆదేశిస్తే.. మేము తలవంచి పాటించేవాళ్లం. ఈరోజున తమరు ‘ఏమి చేయమంటారు?’ అని మమ్మల్నే అడుగుతున్నారు. ఆశ్చర్యకరం.. విచారకరం!” అన్నాడు విద్యాపతి.
“మిత్రమా విద్యాపతీ! ఇంకా పరిస్థితులు మన చేయిదాటి పోలేదు” అన్నాడు త్రిభువనుడు.
“అలా పోవడానికి ఎంతో సమయం పట్టదు ప్రభూ!” ఉక్రోషంగా అన్నది మహారాణి.
“సమయం ఏ ఒక్కరికీ అనుకూలంగా ఉండదు. ప్రతికూలంగా ఉండదు దేవీ!”.
“కానీ, ఇప్పుడు మనకు ప్రతికూలంగానూ, శత్రువుకు అనుకూలంగానూ ఉన్నది ప్రభూ!” అన్నాడు విద్యాపతి.
“అలా ఉన్నదా? ‘అలా ఉన్నదేమో’ అని నువ్వు భ్రమిస్తున్నావా? కాదుకాదు.. భావిస్తున్నావా?” సూటిగా అడిగాడు త్రిభువనమల్లుడు.
“మన్నించండి.. మీ మాటలు మాకు అర్థంకావడం లేదు. మాకు మీరు నేర్పింది ఒకటే! గెలుపా? ఓటమా? విజేతలుగా ఉండటమా? యుద్ధవీరులుగా నిష్క్రమించడమా? భ్రమకు, భావనలకు, వర్తమాన స్థితిగతులకు సమన్వయం కుదరడంలేదు ప్రభూ! అరివీర భయంకరులై, యమకింకరులను కూడా దాసోహం చేసుకున్న మా త్రిభువనమల్ల ప్రభువులు మాకు కావాలి..” ఉద్వేగంగా అన్నాడు విద్యాపతి.
“అయితే, ప్రస్తుతంలో ఉన్న మేము.. మీకు అవసరం లేదా. అప్రస్తుతమా? విద్యాపతీ, నాయకుడు ఎలా ఉండాలో నాయకుడికి చెప్పాల్సిన అవసరంలేదు. అలా నిరూపించుకున్నాం.. నిలబడ్డాం కనుకనే, మేము త్రిభువనమల్ల చక్రవర్తులం అయ్యాం. ఇప్పుడు నువ్వన్నావే.. నిప్పులు కక్కే అప్పటి నాయకుడు కావాలని! ప్రజలకు ఎప్పుడు ఏమి కావాలో, ఎప్పుడు ఎటువంటి భద్రత, సంక్షేమం.. వారు కోరుకుంటున్నారో అది మేమివ్వగలం. ‘కాదు, కూడదు.. మా నాయకుడు ఒకనాటి పద్ధతుల్లో ఉంటేనే, ఆయన నాయకత్వ పటిమను గుర్తిస్తాం’ అని మీరంటే, ఆ నాయకుడు వాస్తవంలో ఉండడు. మీ ఊహల్లో మాత్రమే ఉంటాడు. ఒక్కసారి ఆలోచించండి. యుద్ధంవస్తే ఎలా ఎదుర్కోవాలో మాకు తెలియదా? మీరు నేర్పాలా? ఇప్పుడు, ఈ సమయంలో..” కఠినంగా అన్నాడు త్రిభువనుడు.
“కానీ, ప్రభూ! సరిహద్దు దుర్గం ఒకటి మన చేతుల్లోంచి వెళ్లిపోయింది” అన్నది మహారాణి.
“హు.. ఒక్క దుర్గం! అది ఉంటే ఎంత? పోతే ఎంత? ప్రపంచంలో మన ఒక్కరికే యుద్ధం తెలుసా? ఇంకెవరికీ తెలియదా? నేను కూడా ధర్మ పోరాటాన్నే కోరుకుంటున్నాను. ఎవరొస్తారో రానీ, ఎవరెవరు కూటమి కడతారో కట్టనీ.. అపవిత్ర కూటమికి ఓటమి తప్పదు” అంటూ లేచి వెళ్లిపోయాడు త్రిభువనమల్లుడు.
మహారాణీ, విద్యాపతి.. ముఖాముఖాలు చూసుకొన్నారు. “మహారాణీ! ప్రభువు మనసులో ఏముందో తెలియడం లేదు. వారు ఏమనుకుంటున్నారో, వారి కార్యాచరణ ఏమిటో బోధపడటం లేదు. ఇప్పుడు మనం చేయగలినది కూడా ఏమీ లేదు. ఈలోపు విష్ణువర్ధనుడి సంసిద్ధత ఎంతవరకు ఉన్నదో తెలుసుకోవడానికి రహస్య వేగులను పంపిస్తాను” అన్నాడు విద్యాపతి. ..అయితే ఆ వచ్చిన సమాచారం నమ్మశక్యంకాని విధంగానూ ఉన్నది.
త్రిభువనమల్లుడు పోరాటపటిమను పూర్తిగా విస్మరించాడనీ, మరిచిపోవడమే కాక దైవభక్తిలో లీనమైపోయాడనీ, యుద్ధంలో గెలవడం దేవుడెరుగు..
కత్తిపట్టి నిలబడటం కూడా కష్టమేనని!విష్ణువర్ధనుని సిద్ధాంతం ప్రకారం..రాజ్యాన్నేలే రాజుకు ఉండాల్సింది శక్తి కానీ, భక్తి కాదు!ఇంతకాలం త్రిభువనమల్లుడికి సామంతుడిగా ఉన్న తాను, ఇప్పుడు త్రిభువనమల్లుడినే సామంతుడిని చేసుకోగలడు, చేసుకుంటాడు.విద్యాపతికీ ఈ విషయాలు తెలిశాయి. విద్యాపతి ముందుగా మహారాణి చంద్రలేఖను కలిసి.. ఈ విషయమై చర్చించాలనుకొన్నాడు. కోటలో ఉన్న గుడికి మహారాణివారు వేంచేసి ఉన్నారన్న సమాచారంతో నేరుగా అక్కడికే వెళ్లాడు విద్యాపతి.
“అయితే, ప్రస్తుతంలో ఉన్న మేము.. మీకు అవసరం లేదా. అప్రస్తుతమా? విద్యాపతీ, నాయకుడు ఎలా ఉండాలో నాయకుడికి చెప్పాల్సిన అవసరంలేదు. అలా నిరూపించుకున్నాం.. నిలబడ్డాం కనుకనే, మేము త్రిభువనమల్ల చక్రవర్తులం అయ్యాం. ఇప్పుడు నువ్వన్నావే.. నిప్పులు కక్కే అప్పటి నాయకుడు కావాలని! ప్రజలకు ఎప్పుడు ఏమి కావాలో, ఎప్పుడు ఎటువంటి భద్రత, సంక్షేమం.. వారు కోరుకుంటున్నారో అది మేమివ్వగలం. ‘కాదు, కూడదు.. మా నాయకుడు ఒకనాటి పద్ధతుల్లో ఉంటేనే, ఆయన నాయకత్వ పటిమను గుర్తిస్తాం’ అని మీరంటే, ఆ నాయకుడు వాస్తవంలో ఉండడు. మీ ఊహల్లో మాత్రమే ఉంటాడు”.
– అల్లాణి శ్రీధర్