యాదగిరిగుట్ట, ఆగస్టు 22 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు అనుబంధ పాతగుట్ట ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు జరిగాయి. మంగళవారం స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శత ఘటాభిషేకం జరిపారు. ప్రధానాలయ ముఖమండపంలో శత కలశాలను ఏర్పాటు చేసి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. పంచామృతాలతోపాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ పాంచరాత్రాగమశాస్త్ర రీతిలో నారసింహుడికి పూజలు చేపట్టారు. గిరి ప్రదక్షిణలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా జరిగాయి. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. ప్రధానాలయంలో నిజాభిషేకం జరిపారు. నిజరూప దర్శనంలో నారసింహులు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా సాగింది. ప్రధానాలయ ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా సువర్ణపుష్పార్చనలు జరిపించారు. సాయంత్రం వేళ స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవలు చేపట్టారు. రాత్రి స్వామివారికి తిరువరాధన, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన నిర్వహించారు. రాత్రి ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన జరిగాయి. పాతగుట్టలో నిత్యారాధనలు నిర్వహించారు. క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజ చేశారు. హనుమంతుడిని సింధూరంతో అభిషేకించారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. స్వామివారికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 18 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి ఆలయ ఖజానాకు రూ.24,78,943 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ గీత తెలిపారు. స్వామివారిని జిల్లా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ బొల్లం సంపత్కుమార్ గుప్తా వేర్వేరుగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి ఆలయ ఈఓ గీత స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
స్వామివారి సేవలో మంత్రి ఎర్రబెల్లి..
స్వామివారి సేవలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొని తరించారు. సువర్ణ పుష్పార్చనలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మంత్రికి సంప్రదాయ స్వాగతం పలికారు. అనంతరం మంత్రికి అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారి రామ్మోహన్ స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.