– సిద్దిపేట నియోజకవర్గం తరపున స్వర్ణతాపడానికి కేజీ బంగారం అందజేత
– త్వరలో మరో కేజీ బంగారం
– యాదాద్రిలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు కృషి
– రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హరీశ్రావు
యాదాద్రి : దేశ విదేశాల నుంచి హైదరాబాద్కు వచ్చిన వారు ప్రముఖ యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి వస్తారని, రాబోయే రోజుల్లో యాదాద్రి ప్రాంతం గొప్ప పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి స్వామివారి వేద ఆశీర్వచనం చేశారు.
అనంతరం స్వామివారి బాలాలయంలో విమానగోపురం స్వర్ణతాపడానికి సిద్దిపేట నియోజకవర్గం తరపున కేజీ విలువ గల బంగారు బిస్కెట్లను ఆలయ ఈవో గీతకు అందజేశారు. అనంతరం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న నూతనాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఆలయాన్ని మహాద్భుతంగా నిర్మిస్తుండటం సంతోషించదగిన విషయమని, దేవాలయ నిర్మాణం పూర్తయిందని మార్చి 28న ఆలయాన్ని పునఃప్రారంభం కాబోతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు సిద్దిపేట నియోజకవర్గం నుంచి స్వామివారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి ఒక కిలో బంగారాన్ని విరాళంగా అందజేశామన్నారు.
మరో కిలో బంగారం త్వరలో అందిస్తామని చెప్పారు. ఇప్పటికే విమానగోపురం నిర్మాణం కోసం 35కిలోల బంగారం భక్తులను వచ్చిందని, మరో 45 కేజీల బంగారం ఇచ్చేందుకు దాతలు ముందుకు వస్తున్నారని అన్నారు. యాదాద్రిలో భక్తులు, స్థానికుల అవసరాల దృష్ట్యా 100 పడకల ఆసుపత్రి కావాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి కోరారని, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, కలెక్టర్ పమేలాసత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో భూపాల్రెడ్డి, డీఎంహెచ్వో సాంబశివరావు, జిల్లా కోశాధికారి సురేశ్కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.