యాదాద్రి : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మదిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి తెలంగాణ టూరిజం డెస్టినేషన్ ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. శుక్రవారం కుటుంబ సభ్యులతో పాటు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డితో కలిసి స్వామివారి నిజాభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాదాద్రి నూతనాలయాన్ని తిలకించారు. యాదాద్రి అద్భుతమైన కట్టడాలను చూసి వినోద్కుమార్ ముగ్ధులయ్యారు. సీఎం కేసీఆర్ మదిలో బృహత్తర టూరిజం డెస్టినేషన్ ఉందన్నారు.
హైదరాబాద్ నుంచి బయలుదేరి యాదాద్రి దివ్యక్షేత్రాన్ని దర్శించుకుని ఆ తర్వాత కొలనుపాకలోని ప్రసిద్ధ జైన దేవాలయం, హనుమకొండలోని వెయ్యి స్తంభాల గుడి, వరంగల్ ఫోర్ట్, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, లక్నవరం చెరువు సందర్శన కోసం టూరిజం టూర్ (కాకతీయ సర్క్యూట్ ప్యాకేజీ పరిశీలనలో ఉందన్నారు. జాతీయ, అంతర్జాతీయ టూరిస్టులను ఆకర్శించే విధంగా ప్రణాళికలు రూపొందించనున్నట్లు ఆయన చెప్పారు. సమైక్య పాలనలో రాష్ట్రంలోని దేవాలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలోనే దేవాలయాలకు మహర్ధశ కలుగుతోందన్నారు.
రాజరిక వ్యవస్థలో కాకతీయులు, చోళ, పాండ్య, శ్రీకృష్ణదేవరాయలు సంస్కృతిని పెంపొందించారని, అయితే ప్రజాస్వామ్య దేశంలో అలాంటి పాత్రను పోషిస్తున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అని వినోద్కుమార్ పేర్కొన్నారు. యాదాద్రిలో అద్భుతమైన కట్టడాలు ప్రతి ఒక్కరికి గొప్ప అనుభూతిని కలిగిస్తాయని అన్నారు. రానున్న రోజుల్లో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అద్భుతంగా నిర్మించనున్నట్లు తెలిపారు.
గోదావరి నది జలాలను ఈ ప్రాంతానికి తీసుకురావాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమకాలంలో ఇచ్చిన హామీ ప్రకారం నృసింహస్వామి జలాశయం, గంధమల్లను జలాశయాలను నిర్మించారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి విద్యాసాగర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ధర్మేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరె వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.