యాదాద్రి, మార్చి 4 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయ పునః ప్రారంభ సమయంలో చేపట్టాల్సిన మహాకుంభ సంప్రోక్షణకు సుముహూర్తం నిశ్చయమైంది. ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు స్వామివారి బాలాలయంలో 5 కుండాలతో నిర్వహించే యాగాలకు సంబంధించిన ప్రతాలను ఆలయ అర్చకులు సిద్ధం చేయగా.. శుక్రవారం వాటికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో గీత, ప్రధానార్చకుడు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు పాల్గొన్నారు.
ఆన్లైన్ టికెట్ ట్రయల్ రన్ సక్సెస్
యాదాద్రి కొండపైన స్వామివారి దర్శనం టికెట్ కౌంటర్లో శుక్రవారం ఈసీఐఎల్ కంపెనీ అధికారులు ఆన్లైన్ టికెట్ల జారీకి ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.100 దర్శనాల టికెట్లను 200 మందికి జారీ చేశారు. ఆన్లైన్ టికెట్ బుకింగ్, భక్తులను దర్శనాలకు అనుమతినిచ్చే తీరు, ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై ట్రయల్ చేపట్టారు. టీటీడీ తరహాలోనే ఆన్లైన్లో టికెట్ బుకింగ్ వ్యవస్థను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు అధికారులు తెలిపారు. ఉచిత దర్శనాలకు సైతం ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. మరో రెండు రోజులపాటు ట్రయల్ రన్ నిర్వహించి, పూర్తిస్థాయిలో ఆన్లైన్ టికెట్ల వ్యవస్థను తీసుకొస్తామని చెప్పారు.
యాదాద్రీశుడికి బ్రహ్మోత్సవ శోభ
పంచనారసింహుడిగా విరాజిల్లుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం 10 గంటలకు శాస్ర్తోక్తంగా ప్రారంభమయ్యాయి. స్వయంభూ నారసింహుడి అనుమతితో బాలాలయంలో నిత్యారాధనల అనంతరం విష్వక్సేనారాధన, స్వస్తీవాచనం, రక్షాబంధన కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞాచార్య బృందం, ఆలయ అర్చక బృందం, పారాయణదారులు అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6:30 గంటలకు మృత్యంగ్రహం, అంకురారోపణ వేడుకలను పాంచరాత్రాగమ శాస్ర్తానుసారం నిర్వహించారు. మొదటి పూజలో భాగంగా పోచంపల్లికి చెందిన పద్మశాలీ మహాజన సంఘం ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు పట్టువస్ర్తాలు సమర్పించారు. ఈ వేడుకలో ఆలయ అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ఈవో ఎన్ గీత, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, యాజ్ఞీకులు పాల్గొన్నారు.
స్వర్ణతాపడానికి రూ.31 వేల విరాళం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి ఆలయ ఉప ప్రధానార్చకుడు సురేందరాచార్యులు రూ.31,116 విరాళం సమర్పించారు. ఇందుకు సంబంధించిన డీడీని శుక్రవారం యాదాద్రి ఈవో గీతకు అందజేశారు.