నాగర్కర్నూల్, నవంబర్ 26 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ కట్టడం చరిత్రలో నిలిచిపోయే విధంగా రూపకల్పన చేశారని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. శుక్రవారం యాదాద్రి క్షేత్రాన్ని ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా వచ్చి సందర్శించారు. 2 కిలోల బంగారాన్ని ఆలయ కార్యనిర్వాహణాధికారిణి గీతారెడ్డికి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ కళా వైభవం, ఆధ్యాత్మికతో కూడిన పవిత్ర పుణ్యక్షేత్రమని అన్నారు. ప్రధాన ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం కోసం విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. ఆలయ పునఃనిర్మాణంలో భాగస్వామ్యం కావడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనే ఆలయం ఎంతో పవిత్రమైందని చెప్పారు. అందుకే ఆలయాన్ని తిరిగి నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. దేవాలయాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. అలాగే జేసీ బ్రదర్స్ తరఫున కాటేజీ నిర్మాణానికి రూ.2 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. తమ కుటుంబం ఈస్థాయిలో ఉన్నామంటే లక్ష్మీనర్సింహస్వామి కృపాకటాక్షమేనని అన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు ఉన్నారు.