బీబీనగర్, సెప్టెంబర్ 20 : తనను పది రోజులుగా ఏదో శక్తి రావాలని పిలుస్తున్నదంటూ ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో శనివారం చోటుచేసుకున్నది. స్థానికుల వివరాల ప్రకారం… హనుమకొండ జిల్లా రాంనగర్కు చెందిన బర్ల సురేందర్ (36) హైటెక్ సిటీలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. రామంతాపూర్లోని డీమార్ట్ వెనుక ప్రాంతంలో భార్యాపిల్లలతో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం డ్యూటీకని చెప్పి బయలుదేరి క్యాబ్ బుక్ చేసుకుని బీబీనగర్ పెద్ద చెరువు ఆవరణలోకి చేరుకున్నాడు.
చెరువు వద్దకు రాగానే తన భార్యకు, కుటుంబ సభ్యుల ఫోన్లకు మెసేజ్ పెట్టాడు. ‘నాకు నిత్యం కలలో చావు రమ్మంటున్నది. ఏదో శక్తి పిలుస్తున్నది. పీడ కలలు వస్తున్నాయి. ఎవరో పిలుస్తున్నట్టు అనేక రకాలుగా కలలు వస్తున్నాయి. నేను చెరువులో దూకి చనిపోతున్నా. నాకు పాత ఇంట్లో చావు కార్యక్రమాలు చేయాలి. నా చావుకు ఎవరూ కారణం కాదు అని వాయిస్ రికార్డు చేసి పంపించాడు. ఆ తరువాత చెరువు గట్టుపై షూ విప్పి, సెల్ ఫోన్ పక్కనపెట్టి చెరువులో దూకాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టారు. సురేందర్కు భార్య, ఐదేండ్ల కుమారుడు ఉన్నాడు.
సురేందర్ మానసిక స్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల పలు దేవాలయాలకు తీసుకెళ్లినట్టు చెప్పారు. మానసికస్థితి మెరుగు కావడంతో ఇక నుంచి ఉద్యోగానికి వెళ్తానని చెప్పడంతో అనుమతిచ్చినట్టు పేర్కొన్నారు. నాలుగు రోజులుగా డ్యూటీకి సక్రమంగా వెళ్తున్న సురేందర్ శుక్రవారం ఉదయం కూడా డ్యూటీకి వెళ్తున్నట్టు చెప్పి క్యాబ్ బుక్ చేసుకున్నట్టు వారు తెలిపారు.
ఘటనా స్థలానికి చేరుకున్న సురేందర్ భార్య సంధ్యారాణి కూడా చెరువులో దూకింది. అప్రమత్తమైన పోలీసులు, రెస్క్యూ టీం సభ్యులు ఆమెను వెంటనే కాపాడారు. చెరువులో దూకిన సంధ్యారాణి వద్దకు వెళ్లిన కుమారుడు.. ‘అమ్మా నువ్వు చనిపోవద్దు’ అనడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా రోదించారు. కాగా ముమ్మరంగా గాలించి శనివారం ఉదయం సురేందర్ మృతదేహాన్ని బయటకు తీశారు.