స్వరాష్ట్రంలో ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య అందించాలనే సంక్పలంతో ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్ మరొక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన ఊరు-మన బడి పేరుతో ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రవేశపెట్టడంతోపాటు మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. సీఎం కేసీఆర్ సంకల్పం దిశగా దశలవారీగా అన్ని పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై గతేడాది జూలై, ఆగస్టు నెలల్లోనే ఓ సర్వే నిర్వహించింది. పాఠశాలల వారీగా అవసరాలను గుర్తిస్తూ నివేదికను రూపొందించింది. వీటిపై మరోసారి సమీక్షించి తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలుస్తున్నది.
యాదాద్రి భువనగిరి, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సర్కారు బడుల దశ మార్చేందుకు ప్రభుత్వం సిద్ధ్దమైంది. ఈ మేరకు పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. పాఠశాలల్లో మెరుగైన విద్యను అందజేయడంతోపాటు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా రూ.7,289 కోట్లు కేటాయించింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కావాల్సిన వసతులపై సర్వే నిర్వహించిన జిల్లా విద్యాశాఖ ఇప్పటికే చేపట్టాల్సిన పనులకు సంబంధించి నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం త్వరలోనే నిధులను విడుదల చేయనుంది.
సీడీపీ నిధుల నుంచి సింహభాగం
ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా సమకూర్చే నిధులతోపాటు అదనంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఏటా కేటాయించే నియోజకవర్గ అభివృద్ధ్ది నిధుల్లో(సీడీపీ) సింహభాగం నిధులను ఖర్చు చేయనున్నది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సీడీపీ కింద రూ.5 కోట్ల నిధులను కేటాయిస్తున్నది. ఈ నిధుల్లో 40శాతం అంటే రూ.2 కోట్ల నిధులు ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదులు, టాయిలెట్లు, తాగునీటి సరఫరా తదితర పనులను చేపట్టేందుకు వెచ్చించనున్నారు. జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉండడంతో రూ.6 కోట్ల నిధులు జిల్లాలోని పాఠశాలల అభివృద్ధ్దికి ప్రతి సంవత్సరం ఉపయోగపడనున్నాయి.
సిద్ధ్దంగా ఉన్న నివేదికలు
జిల్లాలో ఉన్నత పాఠశాలలు 163, ప్రాథమికోన్నత పాఠశాలలు 68, ప్రాథమిక పాఠశాలలు 481 వరకు ఉన్నాయి. చాలా వరకు పాఠశాలల్లో గదుల కొరత ఉన్నది. కొవిడ్ పరిస్థితుల్లో బోధన లేక తరగతి గదులు వినియోగంలో లేక శిథిల దశకు చేరాయి. చాలాచోట్ల నిర్మాణాలు మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రహరీలు, తాగునీటి వసతి లేకపోవడం, తలుపులు, కిటికీలు, బల్లలు విరిగిపోవడంతోపాటు అటు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నప్పటికీ ఇంకా కొన్నిచోట్ల చిన్నచిన్న పనులు మిగిలిపోయాయి. మౌలిక వసతుల కల్పనపై జిల్లా విద్యాశాఖ పంపిన నివేదిక ఆధారంగా నిధులను కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల అన్నివర్గాల్లోనూ సంతోషం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వ స్కూళ్లల్లో ఆంగ్ల మాధ్యమం విద్య అమలుకు, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం రాబోయే రోజుల్లో చర్యలు చేపట్టనుండడం పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరటనిస్తున్నది.
మంచి పరిణామం
ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయడం మంచి పరిణామం. దాంతో ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కలుతుంది. ఉపాధ్యాయులు కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేసేందుకు వీలు కలుగుతుంది.
రేగట్టె రాజిరెడ్డి, ఉపాధ్యాయుడు, తాళ్లసింగారం
మంచి రోజులొచ్చాయి
ప్రభుత్వం ప్రభుత్వ విద్య బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటుంది. పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోకుండా సదుపాయాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుంది. విద్యార్థులు ఇబ్బందుల్లే లేకుండా చదువుకునేందుకు వీలు కలుగుతుంది.
-కొయ్యడ గాలయ్య, చౌటుప్పల్
ఆంగ్ల మాధ్యమం పెట్టడం హర్షనీయం
అన్ని ప్రభుత్వ పాఠశాల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్లమాధ్యమం ప్రవేశ పెట్టాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించడం అభినందనీయం. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతానికి మన ఊరు- మన బడి కార్యక్రమం నిర్వహించి నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం హర్షనీయం
సీఎం కేసీఆర్ది గొప్ప సంకల్పం
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సర్కారు ప్రత్యేక దృష్టి సారించడం మంచి పరిణామం. మన ఊరు..మన బడి కార్యక్రమం ద్వారా 7,300 కోట్ల రూపాయలను కేటాయించడం హర్షణీయం. మౌలిక వసతులను మెరుగు పరిచి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఆంగ్ల మాధ్యమాన్ని అందించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం గొప్పది. బడుల రూపు రేఖలు మారితే తల్లిదండ్రులకు సర్కారు విద్యపై నమ్మకం కలుగుతుంది. ఉపాధ్యాయులు కూడా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారు.
-సంగి బాలరాజు, ఎస్ఎంసీ చైర్మన్, వెల్మజాల జడ్పీహెచ్ఎస్, గుండాల మండలం