యాదాద్రి, ఫిబ్రవరి 28: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 4 నుంచి ప్రారంభం కానున్నట్టు ఈఓ గీత తెలిపారు. 11 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు బాలాలయంలోనే అంతరంగికంగా జరుపనున్నట్టు పేర్కొన్నారు. ఉత్సవాల ఏర్పాటుపై సోమవారం ఈవో మీడియాకు వెల్లడించారు. ఈ నెల 21నుంచి 28 వరకు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఆలయ పునఃప్రారంభం చేయనున్న నేపథ్యంలో బాలాలయంలోనే స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుపుతున్నట్టు స్పష్టం చేశారు. కొండ కింద జరిగే స్వామివారి నిత్యతిరుకల్యాణం, ఆ మరుసటి రోజు జరిపే దివ్య విమాన రథోత్సవం నిలిపివేస్తున్నట్టు తెలిపారు. 4వ తేదీన స్వస్తీవాచనం, అంకురారోహణం, విష్వక్సేనారాధన, రక్షాబంధనంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పా రు. 5న ధ్వజారోహణం, భేరీ పూజ, 6 నుంచి 12 వరకు స్వామివారికి అలంకార సేవలు నిర్వహిస్తామన్నారు. 10న ఎదుర్కోలు, 11న తిరుకల్యాణోత్సవం, 12న దివ్యవిమాన రథోత్సవం, 13న మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, 14న శతఘటాభిషేకంతో ఉత్సవాలు పరిసమాప్తి అవుతాయని చెప్పారు. తిరుకల్యాణోత్సవంలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి, విప్ గొంగిడి సునీత పాల్గొంటారని తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో బాలాలయంలో ఈ నెల 4నుంచి 14 వరకు మొక్కు సేవలు రద్దు చేసినట్టు పేర్కొన్నారు.ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, టీటీడీ తరపున ఈవో పట్టువస్ర్తాలను సమర్పించనున్నట్టు వివరించారు.