తెలంగాణ రాష్ట్ర సమితిలో ద్విదశాబ్ది ఉత్సాహం ఊపందుకున్నది. ఇటీవల జరిగిన పార్టీ ప్లీనరీ సూపర్ సక్సెస్ అవడంతో ఫుల్ జోష్లో ఉన్న పార్టీ క్యాడర్.. వచ్చే నెల 15న వరంగల్లో నిర్వహించ తలపెట్టిన విజయ గర్జన సభను సైతం విజయవంతం చేసేందుకు సన్నద్ధమవుతున్నది. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశం నిర్వహించి సభ విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నేతృత్వంలో రెండ్రోజుల క్రితం భువనగిరిలో నియోజకవర్గస్థాయి విస్తృతస్థాయి సమావేశం జరిగింది. గురువారం యాదగిరిగుట్ట మండలంలోని
వంగపల్లిలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
సైనికుల్లా కదలాలి
“తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్ పార్టీ.. రాష్ర్టాన్ని సాధించడంతోపాటు బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో రెండు దశాబ్దాలుగా ఎన్నో విజయాలను సొంతం చేసుకుని వచ్చే నెల 15న ద్విదశాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్నది. వరంగల్లో చేపట్టనున్న గులాబీ విజయ గర్జనకు టీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా కదలివచ్చి
విజయవంతం చేయాలి.
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : టీఆర్ఎస్ పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ద్విదశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించి క్యాడర్లో నూతనోత్తేజాన్ని నింపేందుకు పార్టీ అధిష్టానం కృషి చేస్తున్నది. ఇటీవల హైదరాబాద్లోని హైటెక్స్లో పార్టీ ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ప్లీనరీ విజయవంతంతో పార్టీ అధినాయకత్వంతోపాటు శ్రేణుల్లో సైతం ఉత్తేజం కనిపిస్తున్నది. ప్లీనరీకి ముందే కేటీఆర్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించగా.. ఇదే క్రమంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరంగల్ సభ విజయవంతానికి నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. గత సభలకంటే ఉన్నతంగా విజయగర్జన సభను సక్సెస్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో జన సమీకరణకు సంబంధించి ముఖ్య నేతలకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగిస్తున్నారు.
భారీ జన సమీకరణపై దృష్టి
ప్రతి పల్లెకు ఒక బస్సును పంపి విజయ గర్జన సభకు భారీగా జనాన్ని తరలించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లా నుంచి ఎప్పటి మాదిరిగానే జన సమీకరణ భారీగా ఉండేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. మంత్రి జగదీశ్రెడ్డి సైతం ఎప్పటికప్పుడు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ గులాబీ దండు భారీగా కదిలి వచ్చేలా పార్టీ వర్గాలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున సభకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే భువనగిరిలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు జన సమీకరణకు సంబంధించిన కార్యాచరణ అమలుపై పార్టీ శ్రేణులను సమాయత్తపరిచిజోష్ను నింపారు. గురువారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో సభ సన్నాహానికి సంబంధించిన అంశాలను పార్టీ శ్రేణులకు వివరించారు. అలాగే చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, మోత్కూరు, అడ్డగూడూరు, రామన్నపేట మండలాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సారథ్యంలో సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలను భారీగా తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
క్యాడర్లో ఉత్సాహం
టీఆర్ఎస్ను తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దేందుకు అధినేత కేసీఆర్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పకడ్బందీగా చేపట్టారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు కొత్త కమిటీలను ఎన్నుకోగా.. జిల్లా అధ్యక్షుని నియామకం సైతం త్వరలోనే జరగనుంది. ఈ నేపథ్యంలో విజయగర్జన సభను నిర్వహిస్తుండడంతో జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ క్యాడర్లో ఉత్సాహం నెలకొంది. జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా గులాబీ పార్టీకి పట్టం కడుతూ వస్తున్నారు. ఏడేండ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల పాలిట వరంగా మారాయి. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడంతో అన్నివర్గాల ప్రజానీకం టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నది. దీంతో ప్రతి ఎన్నికలోనూ గులాబీ పార్టీ పక్షాన నిలుస్తున్నది. సభకు వచ్చేందుకు సామాన్య జనం సైతం ఆసక్తి చూపుతున్నదని నేతలు పేర్కొంటున్నారు.