“ట్రాక్టర్ డ్రైవర్గా నెలకు పదివేల జీతంతో ఎదుగూ బొదుగూలేని జీవితాన్ని గడిపిన చిన్నూరి స్వామి.. ఇక డోజర్తో మెరుగైన జీవితానికి బాటలు వేసుకుంటానంటున్నాడు.. కూలినాలి చేసుకుని భారంగా బతుకీడుస్తున్న ఆ ఇంటికి వచ్చిన ట్రాలీ ఆటోతో కొత్త జీవితం దిశగా అడుగులు వేస్తామంటున్నారు శ్రీను దంపతులు. నిన్నమొన్నటి వరకూ డ్రైవర్గా పనిచేసిన పోచయ్య.. సొంత ఆటోకు ఓనరయ్యాడు. ఇలా దళిత బంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. వారి ఆర్థిక ఎదుగుదలకు దోహదపడుతున్నది. సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలోని దళిత కుటుంబాల్లో సైతం ఈ పథకం వెలుగులు నింపుతున్నది. మొత్తం 76 కుటుంబాలకు దళిత బంధు సాయం అందుతుండగా..తొలి విడుతలో బుధవారం పది మంది లబ్ధిదారులకు వారు ఎంచుకున్న యూనిట్లను గ్రౌండింగ్ చేశారు. రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతతో కలిసి ట్రాక్టర్లు, ఆటోలకు సంబంధించిన తాళాలను అందజేయగా లబ్ధిదారులు, వారి కుటుంబాలు సంతోషంతో స్వీకరించాయి. భవిష్యత్తుపై బెంగలేని భరోసాను కల్పించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా ఆయా కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి. అభిమానంతో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించాయి.
‘జీవిత చరమాంకంలో అష్టకష్టాలు పడ్డ దళిత కుటుంబాలకు రూ.పది లక్షల సాయం కొండంత భరోసా కలిగిస్తున్నది. దశాబ్దాలుగా పేదరికంలో మగ్గిన దళితుల జీవన చిత్రాన్ని దళిత బంధు పథకం కొద్దిరోజులకే మార్చివేస్తున్నది. అరిగోస పడినచోటనే ఆత్మగౌరవంతో తలెత్తుకుని జీవించేలా తోడ్పాటునందిస్తున్నది. తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి
గ్రామానికి చెందిన పది దళిత కుటుంబాల్లో ఏడుగురికి గూడ్స్ వాహనాలు, ఇద్దరికి డోజర్లు, ఒకరికి ప్యాసింజర్ ఆటోను మంత్రి జగదీశ్రెడ్డి లబ్ధిదారులకు అందించారు.
అనుమానాలన్నీ పటాపంచలు…
సీఎం కేసీఆర్ ఈ ఏడాది ఆగస్టు 4న తన దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి వేదికగా చెప్పిన మాటలను నిజం చేశారు. దళితుల ఖాతాల్లో దళిత బంధు నిధులను జమచేసి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను నిరూపించారు. మొత్తం 76 కుటుంబాలకు పథకాన్ని వర్తింపజేస్తానని చెప్పిన సీఎం.. 66 మంది దళితుల ఖాతాల్లోకి రూ.10లక్షల చొప్పున అక్షరాలా రూ.6.60కోట్లు జమ చేసి ముఖ్యమంత్రి తన సంకల్పాన్ని చాటుకున్నారు. సీఎం కేసీఆర్ ఊరి వాడిలా దళిత వాడల్లో తిరిగి ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలుకరించి దళితుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. నిధులను విడుదల చేయడమే కాదు.. యూనిట్లనూ మంజూరు చేసి పథకం అమలుపై కొంతమంది పెట్టుకున్న అనుమానాలను పటాపంచలు చేశారు. జమ చేసిన నిధుల్లో రూ.10వేల చొప్పున మొత్తం రూ.6.60లక్షలతో రక్షణ నిధిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
లబ్ధిదారులతో మంత్రి ముచ్చట్లు..
యూనిట్లను పొందిన పదిమంది లబ్ధిదారులతో విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ముచ్చటించారు. వారు ఎంచుకున్న యూనిట్ల పట్ల వారికి గల అనుభవాన్ని అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్కల ఉన్న కంపెనీలతో మాట్లాడుకున్నామని.. డీజిల్ ఖర్చులు పోను నెలకు రూ.40వేల వరకు ఇచ్చేందుకు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ సందర్భంగా ఆటోలు తీసుకున్న లబ్ధిదారులు వివరించడంతో మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంచుకున్న వృత్తుల్లో నష్టం వాటిల్లకుండా చూసుకోవాలని, కొద్దిరోజులకే యూనిట్లను అమ్ముకునే పరిస్థితి తెచ్చుకోవద్దని, సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టాలని లబ్ధిదారులకు మంత్రి హితబోధ చేశారు.
సంతోషంలో దళిత కుటుంబాలు..
యూనిట్ల పంపిణీ సందర్భంగా లబ్ధిదారులంతా కొత్త బట్టలు కట్టుకుని కుటుంబ సభ్యులతో కలిసి రైతు వేదిక వద్దకు వచ్చారు. మామిడి తోరణాలు కట్టి, ముగ్గులు వేసి రైతు వేదిక ప్రాంగణాన్ని అధికారులు అందంగా ముస్తాబు చేశారు. కుటుంబ సభ్యులంతా వాహనాల్లో కూర్చుని సరదాగా గడిపారు. దళిత బంధు వర్తింపజేస్తున్న అందరికీ అధికారులు యుద్ధప్రాతిపదికన యూనిట్లను గ్రౌండింగ్ చేస్తున్నారు. తొలి విడుతలో పదిమందికి సంబంధించిన యూనిట్లను గ్రౌండింగ్ పూర్తి చేసి వాహనాలను అప్పగించగా.. మిగతావారికి కూడా గ్రౌండింగ్ చేసే పనిలో ఉండడంతో దళిత కుటుంబాలు సంతోషంలో మునిగిపోయాయి.
ఇన్నేండ్ల బాధలన్నీ పోతయ్..
ఇసుక లారీ డ్రైవర్గా పదిహేనేండ్లుగా పనిచేస్తున్నా. రెండు, మూడు రోజులకోసారి ఇంటికొస్త. ‘ఆటో కొను’ అని మా పిల్లలు అనేటోళ్లు. కొందామంటే పైసలు లేవాయె. ముగ్గురిలో ఇద్దరు కొడుకులు ప్రైవేటుగా పనిచేస్తున్నరు. చిన్నోడు పది పూర్తిచేసిండు. ఇంటిపట్టునే ఉండి పనిచేసుకునేందుకు ఏ ఆసరా లేదాయె. దళిత బంధు పుణ్యమా అని సీఎం సారు దయతో మా ఇంటికి ట్రాలీ ఆటో వచ్చింది. గిప్పుడు లారీపై పోయే అవసరం లేక నిమ్మలమైంది. ఇప్పటివరకు చేసిన కష్టం అంత బతికెటందుకే సరిపోయేది. గిప్పుడు నాలుగు పైసలు ఎన్కేసుకుంటం.
కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం..
దళితబంధు పథకం ద్వారా ట్రాక్టర్ డోజర్లు, ట్రాలీ ఆటోలు, గూడ్స్ ఆటో యూనిట్లను అందుకున్న లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. యూనిట్లను స్వీకరించిన వెంటనే ఆనందంతో వాసాలమర్రిలోని రామాలయం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల పాలిట దేవుడిలా మారాడని ఉబ్బితబ్బిబ్బయ్యారు. గత పాలకులు ఎస్సీలను ఓటు బ్యాంకు గానే పరిగణించారని, ముఖ్యమంత్రి కేసీఆర్ మా బతుకులు మారాలని సంకల్పించి, ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని సర్పంచు పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్కుమార్ అన్నారు. కేసీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు.
తండ్రికి పింఛన్.. కొడుకుకు ట్రాలీ ఆటో…
కష్టకాలంలో మా కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో సాయం అందించి అండగా నిలిచిందని చిన్నూరి ప్రవళిక అంటున్నది. ఆమె మహిళా సంఘం నుంచి రూ.70వేలు రుణం తీసుకుని ఊర్లోనే ఫుట్వేర్ షాప్ను నడుపుకుంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నది. భర్త మహేశ్ ఇసుక లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. డ్యూటీపై వెళ్తే పది, పదిహేను రోజులకు ఓసారే ఇంటికి వచ్చేది. దీంతో ప్రవళిక కలవరపాటుకు గురయ్యేది. ఇప్పుడు దళిత బంధు పథకం కింద ట్రాలీ ఆటో మంజూరవ్వడంతో తన భర్త కండ్లెదుటనే పనిచేసుకునే వీలుకలిగిందని ప్రవళిక సంబురపడిపోతున్నది. మహేశ్ తండ్రి యాదగిరికి సైతం వృద్ధాప్య పింఛన్ వస్తున్నది.
డ్రైవర్ నుంచి ఓనర్గా..
చిన్నూరి ఆండాలు, నర్సయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. కూతుళ్ల పెళ్లిళ్లయ్యాయి. పెద్ద కొడుకు స్వామి ఊర్లోనే ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. దళిత బంధు పథకం స్వామిని నేడు ఓనర్ను చేసింది. ‘పది లక్షలతోని ట్రాక్టర్, డోజర్ కొని నాలుగు పైసలు సంపాదించుకుని అందరిలెక్క ఆర్థికంగా ఎదుగాలనుకుంటున్నా. నా తమ్ముడు బాబు ఓ షోరూంలో డ్రైవర్గా పనిచేస్తున్నడు. అతనికి కూడా నేడో, రేపో కారు మంజూరు కానుంది. అన్నదమ్ములిద్దరం ఇలా జీవితంలో నిలదొక్కుకుంటామని ఊహించలే. సీఎం కేసీఆర్ దయతో మా కష్టాలు తీరినట్లే.’
అప్పుకట్టాలన్న రంది లేదు..
ఏడాది కిందట ఫైనాన్స్లో ట్రాక్టర్ కొనుక్కుని నడుపుకుంటున్నా. ఇంతకుమునుపే దళిత బంధు పథకం ఉంటే అప్పు తెచ్చి కొనుక్కోవాల్సిన అవసరం రాకుండా ఉండేది. నా భార్యకు మంజూరైన ట్రాక్టర్ డోజర్ విలువ రూ.11.30లక్షలు అవుతున్నది. దళిత బంధు డబ్బులకు తోడు సొంత డబ్బులు కలేసుకుని కొనుక్కున్న. అప్పుకట్టాలన్న రంది లేదు. సీఎం కేసీఆర్ సారు.. మా కుటుంబానికి గొప్ప మేలు చేసిండు.
పిల్లల్ని మంచిగ చదివించుకుంట..
నా భర్త మాకున్న ఎకరం పొలంలో వ్యవసాయ పనులు చూసుకుంటున్నరు. కొడుకు భాస్కర్ ఐటీఐ చదివి ప్రస్తుతం ఊర్లోనే వరికోత మిషన్పై డ్రైవర్గా పనిచేస్తున్నడు. దళిత బంధు పథకం కింద వచ్చిన పది లక్షలకు లక్షా నలభై వేలు జమచేసి ట్రాక్టర్ డోజర్ను కొనుక్కున్నాం. ఇక నా కొడుకు ఒకరి కింద డ్రైవర్గా పనిచేసే అవసరం పోయి సొంత బండిపైనే పనిచేసుకునే అవకాశం వచ్చింది. మాటల్లో చెప్పలేనంత సంతోషం కల్గుతున్నది. పెద్ద కూతురు భవాని బీటెక్, చిన్న కూతురు పూజ ఇంటర్ చదువుతున్నది. పిల్లల్ని మంచిగ చదివించుకుంటం.
కలలో కూడా అనుకోలే..
గతంలో దళితులను ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు. మా కష్టాలు తెలిసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ దళిత బంధుతో ఆదుకుంటున్నరు. ఒకప్పుడు కూలీగా పనిచేసిన నేను డ్రైవింగ్ నేర్చుకున్నాక మూడేండ్లుగా భువనగిరిలో కారు డ్రైవర్గా పనిచేస్తున్నా. పదివేల జీతం ఏ మూలకూ సరిపోయేది కాదు. గిప్పుడు బొలేరో కొనుక్కోవడంతో మాకు మంచి రోజులొచ్చినట్లే. మా అన్న బాల మల్లేశ్కు సైతం దళిత బంధు కింద సెంట్రింగ్ సామాను మంజూరైతుంది. మా బతుకులు బాగు చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రతి దళిత కుటుంబం రుణపడి ఉంటది.
కూలీ కుటుంబం.. ట్రాలీ సంబురం
ఫొటోలో కన్పిస్తున్న ఈ దంపతుల పేర్లు దుబ్బాసి లక్ష్మి, శ్రీను. కూలి పనులకు వెళ్తేనే రోజు గడిచే బతుకులు వీరివి. ఒక్కగానొక్క కొడుకు పదో తరగతి చదువుతున్నడు. వీరికి పక్కా ఇల్లు కూడా లేక రేకుల షెడ్డులోనే ఉంటున్నరు. దళితబంధు పథకం ఈ పేద కుటుంబం పరిస్థితిని పూర్తిగా మార్చేయనుంది. శ్రీనుకు డ్రైవింగ్ అనుభవం ఉండడంతో ట్రాలీ ఆటోను ఎంచుకోగా..అధికారులు గ్రౌండింగ్ చేశారు. కూలీలుగానే జీవితాలు వెళ్లదీయడం తప్ప తమ జీవితంలో సొంతంగా ఆటోను కొనుక్కుంటామని అనుకోలేదని ఈ నిరుపేద కుటుంబం ఉబ్బితబ్బిబవుతున్నది. పది లక్షల డబ్బులు ఇచ్చి సీఎం కేసీఆర్ దేవుడోలే ఆదుకున్నారని దుబ్బాసి లక్ష్మి, శ్రీను దంపతులు చెప్తున్నారు.