రాష్ట్రవ్యాప్తంగా ఎంజీయూ నిర్వహిస్తుండగా ఉమ్మడి నల్లగొండలోని ఆరు కేంద్రాల్లో 1,432
మంది హాజరయ్యారు. ఈవెంట్లను ఎంజీయూలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రితోపాటు వైస్ చైర్మన్ వెంకటరమణ, ఎంజీయూ వీసీ గోపాల్రెడ్డి ప్రారంభించారు. పరీక్షల్లో సత్తాచాటి సీటు సాధించాలనే సంకల్పంతో అభ్యర్థులు పోటీపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన అభ్యర్థులతో యూనివర్సిటీ సందడిగా కనిపించింది.
రామగిరి, అక్టోబర్ 23 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో టీఎస్ పీఈసెట్-2021 ఫిజికల్ ఈవెంట్స్ పరీక్షలు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 14కేంద్రాల్లో నిర్వహించారు. 5,054 మంది అభ్యర్థులకు గాను 3,133మంది హాజరయ్యారు. 1,921 విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. ఎంజీయూ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 2,336 మందికి 1,432 మంది హాజరయ్యారు.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ వి.వెంకటరమణ, ఎంజీయూ వీసీ, పీఈసెట్ చైర్మన్ ప్రొ.చోల్లేటి గోపాల్రెడ్డి కన్వీనర్ ప్రొ.వడ్డెపల్లి సత్యనారాయణతో కలిసి ఎంజీయూ ఆవరణలో జెండా ఊపి, బెలూన్స్ ఎగురవేసి ఈవెంట్స్ను ప్రారంభించారు. ఉదయం 7:30నుంచి మధ్యాహ్నం వరకు ఈవెంట్స్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటైన తర్వాత వ్యాయామ విద్యకు ఆదరణ పెరిగిందన్నారు. ఇతర రాష్ట్రలతో చూస్తే మన రాష్ట్రంలోనే డిమాండ్ ఉందన్నారు. క్రీడలతో శరీర దారుఢ్యం, ఆత్మైస్థెర్యం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయన్నారు. కన్వీనర్ ప్రొ.వి.సత్యనారాయణ మాట్లాడుతూ మూడు, నాలుగు రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి జి.ఉపేందర్రెడ్డి, పాలక మండలి సభ్యులు ఆకుల రవి, అంజిరెడ్డి, శ్రీదేవి, ఆడిట్ సెల్ డైరెక్టర్ వసంత, ప్లేస్మెంట్ అధికారి వై.ప్రశాంతి, అల్వాల రవి, మిర్యాల రమేశ్ కుమార్, మద్దిలేటి, కుంభం రాంరెడ్డి, ఎంజీయూ పీడీలు వై.శ్రీనివాస్రెడ్డి, ఆర్.మురళీ పాల్గొన్నారు.
ఎంజీయూలో నిర్మాణాలు అద్భుతం..
ఎంజీయూలో చేపట్టిన నిర్మాణాలు అద్భుతంగా ఉన్నాయని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి అన్నారు. ఇండోర్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ఆయన పరిశీలించి అభినందించారు. దేశంలోని ఏ యూనివర్సిటీలోనూ ఇంతపెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇండోర్ స్టేడియం లేదని పేర్కొన్నారు.
కళాశాలల్లో..
చౌటుప్పల్/కట్టంగూర్ : కట్టంగూర్ మండలం అయిటిపాములలోని జోనా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, చౌటుప్పల్ మున్సిపాలిటీ తంగడపల్లి గ్రామ పరిధిలోని ముస్కు మధుసూదన్రెడ్డి వ్యాయామ కళాశాలలో టీఎస్ పీఈసెట్ ఈవెంట్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా 100 మీ.పరుగు, షాట్ఫుట్, హైజంప్, లాంగ్జంప్ పోటీ పరీక్షలు నిర్వహించారు. మెరిట్ ప్రాతిపాదికన బీపీఈడీలో ప్రవేశం కల్పించనున్నారు. పోటీలను పీఈసెట్ కన్వీనర్ ఫ్రొఫెసర్ వడ్డెపల్లి సత్యనారాయణ, కాలేజీ కో ఆర్డినేటర్ రఫి, చౌటుప్పల్ సీఐ ఎన్ శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ డా.సంజయ్కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.