యాదాద్రి, నవంబర్18 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతో పాటు పాతగుట్ట ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకల నిర్వహణకు గురువారం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అధిక సంఖ్యలో భక్తులు వ్రతాలు ఆచరించనున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతి రెండు గంటలకు ఒక బ్యాచ్ చొప్పున వ్రతాలు నిర్వహించనున్నారు. కొండకింద పాత గోశాల ఆవరణంలోని రెండు వసతి గృహాల గదులతో పాటు పాత గోశాలలోని కల్యాణ మండపంలో వ్రతాలు జరుపనున్నారు. వ్రతాలు ఆచరించే దంపతులు రూ. 500 చెల్లించాల్సి ఉంటుందని ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు. ఒక్కరోజే సుమారు 2 నుంచి 3 వేల మంది భక్తులు వ్రతాలు ఆచరించేలా ఏర్పాట్లు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. వ్రతాల్లో పాల్గొనే భక్తులకు కావాల్సిన సామగ్రి కిట్లను సిద్ధం చేశారు. లడ్డూ ప్రసాదాన్ని సిద్ధంగా ఉంచారు. పాతగోశాల వెనుక భాగంలోని 10 ఎకరాల స్థలంలో వాహనాల పార్కింగ్కు కేటాయించిన్నట్లు ఈఓ తెలిపారు. సోమవారం వరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఆలయ వేళల్లో మార్పులు చేస్తున్నట్లు వివరించారు.
గుట్ట ఆలయ వేళల్లో మార్పు ఇలా..
తెల్లవారుజామున 3 గంటలకు ఆలయం తెరుస్తారు, 3.30 గంటల వరకు స్వామి అమ్మవార్లకు సుప్రభాతం, 4 గంటలవరకు బిందెతీర్థం, ఆరాధన, 4.30 వరకు బాలభోగం, అప్పటి నుంచి ఉదయం 7.30 గంటల వరకు ఉభయదర్శనాలు, 8.30 వరకు స్వామివారి అభిషేకం, 9 గంటల వరకు స్వామివారికి సహస్రనామార్చన, 10 గంటల వరకు శ్రీ సుదర్శన నారసింహహోమం, 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీస్వామివారి నిత్యకల్యాణం, 12.30 నుంచి 1.30 గంటల వరకు కార్తీకపౌర్ణమి సందర్భంగా స్వామివారికి అన్నకూటోత్సవం మధ్యాహ్నం 1.30 నుంచి రాత్రి 7 గంటల వరకు ఉభయ దర్శనాలు, రాత్రి 7.30 గంటలరకు ఆరాధన, 8.15 గంటలరకు శ్రీస్వామివారి సహస్రనామార్చన, 9 గంటల వరకు ధర్మ, ఉభయ దర్శనాలు, రాత్రి 9.30 గంటల వరకు స్వామివారికి రాత్రి నివేదన.