యాదాద్రి భువనగిరి, నవంబర్ 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే వేసవిలో మినహా వ్యవసాయ సీజన్లో కూలీల హాజరు శాతం తక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పొడవునా ఉపాధి కల్పించే దిశగా కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో రోజుకు 30 మంది కూలీలకు విధిగా పనులు కల్పించాలని నిర్దేశించింది. ఈ మేరకు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి కూలీల హాజరుశాతం మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ కూలీల కడుపు నింపేలా ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తుండగా.. వేతనంతో ఆర్థిక చేయూత కలుగుతోందని కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన శ్రామిక బడ్జెట్ ప్రణాళికలో భాగంగా అన్ని గ్రామాల్లో గ్రామసభలు కొనసాగుతున్నాయి.
కూలీలకు గొప్ప ఊరట..
కొవిడ్ పరిస్థితుల్లో గత రెండేళ్లుగా అనేక రంగాలు కుదేలయ్యాయి. ఈ పరిస్థితుల్లో పనులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూలీలకు ఉపాధి హామీ పథకం కొండంత భరోసా కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం చూపిన ప్రత్యేక చొరవ ఫలితంగా.. స్థానిక కూలీలతోపాటు వలస కూలీలకూ సొంతూరులోనే ఉపాధి పుష్కలంగా దొరుకుతోంది. అడిగిన ప్రతి ఒక్కరికీ జాబ్కార్డును మంజూరు చేసి ఉపాధి కల్పించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులు ఆపత్కాలంలో కూలీలకు గొప్ప ఊరటను కల్గిస్తున్నాయి.
వ్యవసాయ పనుల సీజన్లోనూ..
ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇకపై గ్రామాల్లో ప్రతి రోజూ కనీసం 30 మందికి ఉపాధి హామీ పనులు కల్పించనున్నారు. ఇప్పటికే గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నుంచి గ్రామ కార్యదర్శులకు ఆదేశాలు జారీ కావడంతో ఆ దిశగా కార్యాచరణ మొదలైంది. ఉపాధి హామీ నిబంధనల ప్రకారం.. ఒక్కో కూలీకి ఏడాదిలో కనీసం 100 రోజుల పని కల్పించాలి. వేసవిలో, వ్యవసాయ పనులు లేనప్పుడు ఉపాధి పనులకు డిమాండ్ ఉంటుండగా.. ఏప్రిల్, మే, జూన్లో 70శాతానికి పైగా కూలీలు పనులు చేసేందుకు వస్తున్నారు. అయితే వ్యవసాయ పనుల సీజన్లో మాత్రం హాజరుశాతం తక్కువగా ఉంటోంది. ఉపాధి హామీ వేతనంగా రోజుకు రూ.240 వరకు ఇస్తుండగా.. ఇతర పనులకు వెళ్లే వారికి అంతకంటే ఎక్కువ కూలి వస్తుండడంతో ఉపాధి పనులకు వచ్చేందుకు కూలీలు ఆసక్తిచూపడం లేదు. నల్లగొండ జిల్లాలో 3,72,216 జాబ్ కార్డులకు గత మూడేండ్లలో సగటున 2,43,853 మంది మాత్రమే పనులకు వస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో 2,63,193 జాబ్ కార్డులకు 1,81,699 మంది కూలీలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,56,829 జాబ్ కార్డులకు 96,029 మంది పనులకు హాజరవుతున్నారు. ప్రస్తుతం ప్రతి గ్రామంలో 10 నుంచి 15 మంది మాత్రమే ఉపాధి పనులతో లబ్ధి పొందుతుండగా.. ఇక నుంచి ఆ సంఖ్య 30 వరకు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
అడిగిన వారందరికీ జాబ్ కార్డులు
ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి సొంతూర్లకు వచ్చిన కూలీలతోపాటు స్థానిక కూలీల్లో చాలా మందికి జాబ్ కార్డులు లేవు. ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన కారణంగా చాలా వరకు కూలీలు జాబ్ కార్డులు తీసుకోలేదు. అయితే వీరు సొంతూళ్లకు వచ్చి పనులు చేయాలనుకున్న సందర్భంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జాబ్ కార్డు లేనిదే పనులు కల్పించే పరిస్థితి లేకపోవడంతో లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి నిమిత్తం జాబ్కార్డులు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో అధికారులు వలస కూలీలకు వెంటనే జాబ్ కార్డులు మంజూరు చేస్తున్నారు.
వచ్చే ఏడాది పనుల కోసం గ్రామసభలు
అడిగిన వారందరికీ పని కల్పించేలా ప్రతిపాదనలు రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పనుల గుర్తింపు ప్రక్రియ మొదలైంది. పనుల ఎంపికలో పారదర్శకత కోసం కొద్దిరోజులుగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. కూలీలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో పనులను ఎంపిక చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు గ్రామ సభలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆమోదం లభించిన తర్వాత వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఎంపిక చేసిన పనులను ప్రారంభించి కూలీలకు ఉపాధి కల్పించనున్నారు.
కోరిన వారికి పనులు కల్పించేందుకు చర్యలు
అన్ని సీజన్లలోనూ ఉపాధి పనులు ముమ్మరంగా సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రతి గ్రామంలో రోజుకు 30 మందికి పని కల్పించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలు, గ్రామ కార్యదర్శులు నిత్యం పర్యవేక్షించి ప్రతి రోజూ కూలీలు పనులకు హాజరయ్యేలా చర్యలు చేపడుతారు. జాబ్కార్డు లేని వారు పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకుంటే వెంటనే పనులు కల్పించేలా చర్యలు తీసుకుంటాం.
-ఉపేందర్రెడ్డి, డీఆర్డీఓ, యాదాద్రి భువనగిరి జిల్లా