తెలంగాణ రైతు పండించిన వడ్లు కొంటారా, కొనరా? తేల్చిచెప్పండంటూ కేంద్రాన్ని నిలదీసేందుకు యావత్ రైతాంగం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసించేందుకు అన్నదాతకు అండగా టీఆర్ఎస్ పార్టీ రగల్ జెండా ఎత్తుతున్నది. ధాన్యం సేకరణలో కేంద్రం సహాయ నిరాకరణనిరసిస్తూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు మహా ధర్నాకు గులాబీ సేన సన్నద్ధమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం మేరకు జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు జరుగనున్నాయి. ఎన్నికల కోడ్కు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో స్వయంగా ఎమ్మెల్యేలు ధర్నా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి రైతాంగంతోపాటు పార్టీ శ్రేణులు తరలివచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం వరకు వేలాది మంది భాగస్వాములు కానున్నట్లు భావిస్తున్నారు. రైతు గోస ఢిల్లీకి వినిపించేలా, కేంద్రానికి సెగ తాకేలా ధర్నా నిర్వహిస్తామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
యాదాద్రి భువనగిరి, నవంబర్ 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం నిర్వహించ తలపెట్టిన మహాధర్నాకు జిల్లా నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ధర్నాకు అనుమతి కోరుతూ ఇప్పటికే పార్టీ శ్రేణులు కలెక్టర్లకు లేఖలు అందించగా వారి మార్గదర్శకాలకు అనుగుణంగా ధర్నాలు నిర్వహించేందుకు నేతలు సమాయత్తమయ్యారు. ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే ధర్నాలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, భువనగిరి కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి పాల్గొననున్నారు. అదేవిధంగా చౌటుప్పల్ ప్రాంతం నుంచి తరలివెళ్లేవారు మునుగోడులో జరిగే ధర్నాలో పాల్గొననుండగా మోత్కూరు, అడ్డగూడూరు మండలాల వారు తుంగతుర్తికి, రామన్నపేట మండలాల వారు నకిరేకల్కు తరలివెళ్లనున్నారు. శుక్రవారం నిర్వహించే నిరసన సెగలు ఢిల్లీకి తాకేలా గులాబీ శ్రేణులు కదం తొక్కనుండగా.. మహాధర్నాలో రైతాంగం సైతం పెద్ద ఎత్తున పాల్గొనేలా నేతలు తలమునకలయ్యారు.
ఢిల్లీకి సెగ తగిలేలా..
కేంద్రం చేపడుతున్న వ్యవసాయ వ్యతిరేక విధానాలపై రైతాంగం ఆందోళన చెందుతోంది. రైతు పక్షపాతి అయిన సీఎం కేసీఆర్ కేంద్రం తీరుపై మండిపడ్డారు. ఇందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ శుక్రవారం మహా ధర్నాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ సందర్భంగా కేంద్రం రైతాంగంపై కత్తిగట్టిన వైనాన్ని యావత్ ప్రజానీకానికి తెలపాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ వడ్లు కొంటరా? కొనరా? అంటూ బీజేపీపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. రైతులు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొనేలా చూసి టీఆర్ఎస్ నిరసన గళం ఢిల్లీకి తాకేలా కదం తొక్కాలని మహా ధర్నాకు సన్నద్ధమైంది.
విజయప్రదానికి కార్యాచరణ
జిల్లాలో చేపట్టే మహాధర్నాలను జయప్రదం చేసేలా పార్టీ శ్రేణులు కార్యాచరణను రూపొందించుకుని అమలు దిశగా ముందుకు సాగుతున్నాయి. ఉదయం 10గంటలకే ధర్నాలు ప్రారంభం కానుండగా.. అంతకుముందే పెద్ద ఎత్తున ధర్నా ప్రాంగణానికి అన్నివర్గాల ప్రజలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఐదువేల మందికి తక్కువ గాకుండా ధర్నాకు తరలివచ్చేలా సన్నద్ధం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని మండల, గ్రామ, మున్సిపల్, పట్టణ స్థాయి కమిటీలతో పాటు రైతు బంధు సమితుల ప్రతినిధులు, రైతులు ధర్నాలో భాగస్వామ్యులై కేంద్రంపై తమ నిరసన గళాన్ని వినిపించనున్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా కేం ద్రం అనుసరిస్తున్న నాన్చుడు ధోరణిని ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు తమ ప్రసంగాల ఎండగట్టనున్నారు. ఆలేరు, భువనగిరిలో ధర్నాలను నిర్వహించే ప్రాంతాలను గురువారం ఎమ్మెల్యేలు, జిల్లా నేతలు పరిశీలించారు. వడ్ల కొనుగోలుకు కేంద్రం దిగొచ్చేదాకా పోరాడుతా మని నేతలు స్పష్టం చేస్తున్నారు.
రైతులకు శాపంగా కేంద్ర నిర్ణయం
ఒకప్పుడు దండుగన్న వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షతో పండుగలా చేసి చూపించగా..కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు రైతాంగానికి శాపంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ వంటి పథకాలు రైతు ఆర్థికాభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించాయి. పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగాన్ని ఏడేండ్ల కాలంలోనే ప్రభుత్వం పరిపుష్టం చేసింది. యాదాద్రి జిల్లాలో గోదావరి నీళ్లు అందుబాటులోకి వచ్చాక జిల్లా ముఖచిత్రమే మారుతోంది. రైతు కుటుంబాలు సైతం సంతోషంతో జీవనం సాగిస్తున్నాయి. చివరి ఆయకట్టుకు సైతం సాగు నీరందుతుండగా.. ధాన్యం పుట్లకొద్దీ చేతికందివస్తున్న తరుణంలో కేంద్రం ధాన్యం కొనబోమని మెలిక పెట్టడం రైతులను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఈ పరిస్థితుల్లోనే టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేప ట్టి రైతన్నలకు దన్నుగా నిలుస్తుండడాన్ని వివి ధ వర్గాలు స్వాగతిస్తున్నాయి.