యాదాద్రి, నవంబర్ 10 : ప్రజలంతా భక్తిభావం అలవర్చుకోవాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి సూచించారు. బుధవారం యాదగిరి గుట్ట మండలంలోని మాసాయిపేట సీతాకోదండరామస్వామి దేవాలయంలో స్వామి, అమ్మవార్ల విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అంగారక ఉపాసకులు నాగిళ్ల శ్రవణ్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం 7 గంటలకు గణపతి పూజ, ఆఖండ దీపస్థాపనలతో ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఆగమశాస్త్ర ప్రకారం ప్రారంభించారు. సాయంత్రం 4.30 గంటలకు చండీహోమం, రాత్రి 7.30 గంటలకు ధాన్యాదివాసం, ఫల, పుష్ప, శయ్యాదివాసం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. అనంతరం మంగళహారతి, తీర్థప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వంటేరు సువర్ణాఇంద్రసేనారెడ్డి, ఉప సర్పంచ్ వాకిటి అమృత, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు వంటేరు సురేశ్రెడ్డి, వార్డు సభ్యులు గుణగంటి బాబూరావు, నాయకులు బండ బాలసిద్ధులు, అన్వర్, మధు, బండ భాస్కర్, గొట్టిపర్తి బాలరాజుగౌడ్ పాల్గొన్నారు.
బునాదిగాని కాల్వ పనులు పూర్తిచేయాలి
ఆత్మకూరు(ఎం) : మండలానికి సాగు నీరు అందించేందుకు నిర్మిస్తున్న బునాదిగాని కాల్వ పనులను త్వరగా పూర్తి చేయాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీసు చందర్గౌడ్ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డిని హైదరాబాద్లోని ఆమె నివాసంలో బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. వెంటనే ఆమె స్పందించి జిల్లా నీటి పారుదల శాఖ అధికారులను కాల్వను పరిశీలించాలని ఆదేశించారు. నీటి పారుదల శాఖ ఈఈ వేణుగోపాల్రావు మండల కేంద్రంతోపాటు పాసానికుంట, తిమ్మాపురం, రహీంఖాన్పేటలో అసంపూర్తిగా ఉన్న కాల్వ పనులను పరిశీలించారు. నెల రోజుల్లో పనులను పూర్తి చేస్తామని తెలిపారు. నీటి పారుదల శాఖ డీఈ సునీల్ప్రసాద్, ఏఈ వెంకటరమణ, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథగౌడ్, టీఆర్ఎస్ యువజన విభాగం మాజీ మండలాధ్యక్షుడు బూడిద శేఖర్, సోషల్ మీడియా మండల కన్వీనర్ ఎలగందుల విజయ్, రైతులు పాల్గొన్నారు.