మా వడ్లు కొంటరా? కొనరా?.. ముఖ్యమంతి చంద్రశేఖర్రావు చేసిన ఒక్క ప్రకటన దేశమంతా ప్రకంపనలు సృష్టించింది. అటు రాజకీయ వర్గాల్లో.. ఇటు రైతు సమూహంలో కదలిక తీసుకొచ్చింది. కేసీఆర్ బాటలోనే టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని నిలదీసేందుకు, నిగ్గు తేల్చేందుకు పార్లమెంట్ను వేదికగా చేసుకున్నారు. ఉభయ సభల లోపల, బయట టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలిపారు. తెలంగాణ రైతాంగం కోసం బుధవారం ఉదయం నుంచి పోడియంలోనే ఉండి నిలదీస్తుంటే.. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు నిర్లిప్తంగా ఉండడాన్ని యావత్ రైతాంగం ఉపేక్షించలేకపోయింది. గల్లీలో ఊకదంపుడు ప్రసంగాలు చేసే ఆ పార్టీల నేతలు ఢిల్లీలో ఎందుకు మాట్లాడడం లేదని రైతులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. కేంద్రం తీరుతో రైతాంగం కడగండ్ల పాలవుతుంటే.. చూస్తూ మిన్నకుండిపోయిన ఆ పార్టీల తీరుపై ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. అదే క్షణంలో టీఆర్ఎస్ ఎంపీల పోరాట స్ఫూర్తిపై ప్రసంశలు కురిపిస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ‘కంచె చేను మేస్తే..’ అనే నానుడి కేంద్ర ప్రభుత్వ తీరుకు అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది. అలాగే.. రైతుల సమస్యలపై ఉద్యమించాల్సిన కాంగ్రెస్ సైతం దిగజారుడుగా వ్యవహరిస్తున్నది. ‘సందట్లో సడేమియా’ అన్నట్లు వ్యవహరిస్తున్న ఆపార్టీ తీరు ‘జై జవాన్ జై కిసాన్’ అనే నినాదాన్ని మర్చిపోయింది. టీఆర్ఎస్పై, కేసీఆర్పై పసలేని వాదనలు చేస్తూ.. కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ద్వేషభావాన్ని రెచ్చగొడుతున్న ఈ రెండు పార్టీలు పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రైతాంగం ఆకాంక్షను మాత్రం చాటలేకపోయాయి. అదే కేంద్రం వైఖరిపై టీఆర్ఎస్ పార్టీ ఓ స్పష్టతతో ముందుకు వెళ్తుండడం.. అన్నదాతల పక్షాన నిలిచి పార్లమెంట్లో కేంద్రం నిగ్గు తేల్చే దిశగా ఆ పార్టీ ఎంపీలు అడుగులు వేయడాన్ని యావత్ రైతాంగం వేనోళ్లా కొనియాడుతున్నది.
తెలంగాణ రైతాంగం పండించిన వడ్లను కొనాల్సిందేనంటూ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కేంద్రంపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. నూతన వ్యవసాయ, విద్యుత్తు చట్టాలతో పాటు వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో రైతులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉండడంతో సీఎం కేసీఆర్ ఆది నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో భాగంగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలను నిర్వహించారు. ఆతర్వాత హైదరాబాద్లోనూ చేపట్టిన ధర్నాలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతాంగం సైతం టీఆర్ఎస్కు మద్దతుగా నిలిచి ధర్నాల్లో కదం తొక్కింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనూ తెలంగాణ రైతు వాణిని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ పార్లమెంట్లో ఎంపీలు చేపట్టే పోరాటానికి దిశానిర్దేశం చేశారు. సమావేశాల ప్రారంభం నుంచే నిరసన గళాన్ని విన్పిస్తూ వస్తున్న టీఆర్ఎస్ ఎంపీలు బుధవారం ఉదయం నుంచి పోడియం వద్దనే ఉండి ధర్నా చేశారు. బీజేపీ రైతు ద్రోహి అంటూ నినాదాలు చేసి తెలంగాణ రైతాంగం పక్షాన పోరాటం చేస్తూ వస్తున్నారు. అయితే ధాన్యం సేకరణపై ఢిల్లీలో ఒక మాట, గల్లీలో మరోమాట మాట్లాడుతున్న బీజేపీ ఎంపీలుగానీ, రైతు సంక్షేమమే మా ధ్యేయం అంటూ సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్న కాంగ్రెస్ ఎంపీలెవరూ గళమెత్తకుండా మౌనరూపం దాల్చడం పట్ల రైతాంగం మండిపడుతున్నది. ఆ రెండు పార్టీల నేతలు రైతులతో రాజకీయం చేయడం మానుకోవాలని హితవుపలుకుతున్నది.
ఆది నుంచీ రైతులకు టీఆర్ఎస్ భరోసా…
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగు విస్తీర్ణం సైతం గణనీయంగా పెరిగి వరి దిగుబడి రికార్డు స్థాయిలో వస్తున్నది. కానీ, కేంద్రం ధాన్యాన్ని కొనకుండా కక్షపూరితంగా వ్యహరిస్తున్న నేపథ్యంలో ఆది నుంచీ రైతు పక్షాన నిలుస్తున్న టీఆర్ఎస్ పార్టీ రైతాంగ సమస్యను మరోసారి భుజానికెత్తుకుని ఉద్యమిస్తున్నది. కేంద్రం విరమించుకున్న రైతు చట్టాల రద్దు వెనుక టీఆర్ఎస్ కీలక పాత్ర ఉండగా.. భవిష్యత్ పోరాటాల్లోనూ టీఆర్ఎస్ ముందుండి పోరాడుతుందన్న భరోసా రైతులకు కల్గుతున్నది. కేంద్రం తలొగ్గి వడ్లను కొనుగోలుకు ఒప్పుకోవడం ద్వారా టీఆర్ఎస్ ఎంపీల పోరాటం ఫలించాలని తెలంగాణ రైతాంగం కోరుకుంటున్నది.
రైతుల పక్షాన పోరాటం గొప్ప విషయం
బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు టీఆర్ఎస్ ఎంపీలను చూసి నేర్చుకోవాలి. రైతుల పక్షపాతిగా వారి సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. కానీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు రైతుల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేదు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సాక్షిగా రైతులకు న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నారు. ఇప్పటికైనా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వైఖరి మార్చుకొని రైతులకు న్యాయం జరిగేవిధంగా గొంతెత్తాలి.
కేసీఆర్ను ఢీ కొట్టలేక డ్రామాలాడుతున్న బీజేపీ…
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను ఢీకొట్టలేక బీజేపీ నాయకులు డ్రామాలాడుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ రైతాంగం పట్ల వివక్ష చూపుతున్నారు. రాష్ట్రంలో అడ్రస్ గల్లంతవుతున్నా ప్రజలను గాలికొదిలేసేందుకే కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది. ఆ రెండు పార్టీలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయి. యాసంగిలో ధాన్యం తీసుకోమని కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్తుంటే.. మరో పక్క తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాత్రం ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించడం సరికాదు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏకంగా రైతులను నట్టేట ముంచేందుకు వరి వేయాలని పిలుపు నివ్వడం సిగ్గుచేటు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలం రైతుల పక్షాన నిలబడి ఉద్యమం చేస్తుంటే ఆ రెండు పార్టీలు కనీస మద్దతు ఇవ్వకపోగా నాటి తెలంగాణ ఉద్యమంలో మాదిరిగా నేడు కూడా రైతు ఉద్యమాన్ని హేళనగా చూస్తున్నాయి. ఇప్పటికైనా ధాన్యం ఎంత కొంటారో స్పష్టమైన ప్రకటన చేసే వరకూ ఉద్యమం కొనసాగుతుంది.
టీఆర్ఎస్ ఎంపీల పోరాటం అభినందనీయం..
ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ వేదికగా పోరాటం చేయడం అభినందనీయం. దేశానికి అన్నం పెట్టే రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ నీతిని అవలంబిస్తున్నది. రైతు ఏడ్చిన రాజ్యాలు బాగుపడిన దాఖలాల్లేవు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మెండి వైఖరి మార్చుకొని రైతన్న శ్రేయస్సు కోసం ఆత్మ విమర్శ చేసుకోవాలి. చివరి ధాన్యం గింజ వరకూ కొనుగోలు చేస్తామని భరోసా కల్పించాలి. రైతన్న పక్షాన నిలబడి నిరసన తెలుపుతున్న టీఆర్ఎస్ ఎంపీలకు మా పూర్తి మద్దతు ఉంటుంది.
బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలకు రైతుల గోస కన్పిస్తలేదా
ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు చేయకపోవడంతో రైతులు పడుతున్న గోస బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలకు కన్పిస్తలేదా. రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన తెలిపితే కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మొద్దు నిద్ర పొతున్నారు. కనీసం రైతుల పక్షాన మాట్లాడకుండా, టీఆర్ఎస్ ఎంపీలకు మద్దతు తెలుపకపోవడం దారుణం. రైతులకు న్యాయం జరిగేలా గొంతెత్తని ఎంపీలు గ్రామాల్లో ఏ ముఖం బెట్టుకుని తిరుగుతారు.
నిమ్మకు నీరెత్తినట్లుగా కాంగ్రెస్, బీజేపీ వ్యవహారం..
ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని ప్రకటించాలని టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు సాక్షిగా ఆందోళన చేయడం గొప్ప విషయం కానీ, రాష్ట్రంలో రైతులను ఉద్దరిస్తున్నట్లు మాట్లాడే బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవడానికి ఇప్పటికైనా టీఆర్ఎస్ ఎంపీలతో మిగిలిన పార్టీల ఎంపీలు కలిసి పోరాడాలి.