యాదాద్రి, ఫిబ్రవరి 10 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు రేపు (శుక్రవారం) ప్రారంభం కానున్నాయి.
ఈ నెల 17 వరకు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలకు శుక్రవారం ఉదయం 9గంటలకు స్వస్తీవాచనంతో శ్రీకారం చుట్టనున్నట్లు ఆలయ ఈఓ ఎన్.గీత గురువారం మీడియాతో తెలిపారు. 12న ఉదయం 10 గంటలకు ధ్వజారోహణం, 13న రాత్రి 8 గంటలకు ఎదుర్కోలు, 14న రాత్రి 8 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం (గజవాహనం) నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
15న రాత్రి 8 గంటలకు రథోత్సవం, 17న ఉదయం 9 గంటలకు స్వామివారి శతఘటాభిషేకం, మధ్యాహ్నం ఒంటి గంటకు మహదాశీర్వచనం, పండిత సన్మానంతో ఉత్సవాలకు పరిసమాప్తి పలుకుతామని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆమె వివరించారు.