శ్రావణమాసంలో వచ్చే శుక్ల పంచమిని నాగపంచమిగా జరుపుకోవటం ఆనవాయితీ. ఆదిశేషుడు తనకు చేసిన సేవకు మెచ్చిన శ్రీమహావిష్ణువు అతడిని ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. సర్పజాతి ఆవిర్భవించిన శ్రావణ శుక్ల పంచమి నాడు సృష్టిలోని మానవులంతా తమకు పూజ చేసేలా అనుగ్రహించమని వరం అడుగుతాడు ఆదిశేషుడు. విష్ణుమూర్తి అనుగ్రహించాడు. ఈ వరం కారణంగా శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా జరుపుకొనే ఆచారం వ్యాప్తిలోకి వచ్చింది. ఈ సందర్భంగా నాగులకు ప్రత్యేక పూజలు చేస్తారు. నైవేద్యంగా పాలు సమర్పిస్తారు.
వర్షాకాలంలో పాములు పుట్టల్లోంచి బయటికి వచ్చి, సంచరిస్తాయి. ఈ సమయంలో పాములు పంటల్ని నాశనం చేసే క్రిమికీటకాల్ని తింటూ రైతుకు పంటనష్టం కలగకుండా పరోక్షంగా సాయం చేస్తాయి. పంట పొలాలకు శత్రువులు ఎలుకలు. వాటిని నిర్మూలించేవి పాములు. ఏదైనా కారణం వల్ల క్రమంగా పాములు కనుమరుగైతే, మానవాళి మనుగడకే ప్రమాదం. ఈ క్రమంలో పంటలను కాపాడే పాములను రైతులు దేవతలుగా భావిస్తారు. వాటికి కృతజ్ఞత తెలుపుతూ నాగులను పూజించే ఆచారం ఏర్పడిందని పెద్దల మాట. నాగపంచమి రోజునే గరుడ పంచమి జరుపుకొనే ఆచారం కూడా వ్యాప్తిలో ఉంది. తన తల్లి వినతను దాస్యం నుంచి విముక్తురాలిని చెయ్యడం కోసం గరుత్మంతుడు స్వర్గంలో ఉన్న అమృతాన్ని తెచ్చి పినతల్లి కద్రువ కుమారులైన సర్పాలకు ఇచ్చాడు. అమృతాన్ని సాధించటం కోసం గరుత్మంతుడు చేసిన భీకరమైన పోరాటానికి, అతని మాతృభక్తికి చిహ్నంగా.. ఆయన అమృతాన్ని తెచ్చిన శ్రావణ శుద్ధ పంచమి గరుడ పంచమిగా చేసుకుంటారు.