బెల్గ్రేడ్: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు జోరు కనబరుస్తున్నారు. 63.5 కేజీల విభాగం తొలి బౌట్లో స్టార్ బాక్సర్ శివ థాపా 5-0తో విక్టర్ (కెన్యా)పై ఏకపక్ష విజయం సాధించగా.. దీపక్ (51 కేజీలు) ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లాడు. తొలిసారి మెగాటోర్నీ బరిలోకి దిగిన దీపక్ మంగళవారం 5-0తో అజత్ (కిర్గిస్థాన్)ను చిత్తు చేశాడు. సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన పోరులో ఆకాశ్ సాంగ్వాన్ (67 కేజీలు) 5-0తో ఫర్ఖాన్ (టర్కీ)పై గెలుపొందగా.. రోహిత్ మోర్ (57 కేజీలు), సచిన్ కుమార్ (80 కేజీలు), సంజీత్ (92 కేజీలు) తొలి రౌండ్లో విజయాలు సాధించి ముందడుగేశారు. బెల్గ్రేడ్ వేదికగా జరుగుతున్న ఈ చాంపియన్షిప్లో వంద దేశాల నుంచి 600 మంది అత్యున్నత స్థాయి బాక్సర్లు పాల్గొంటుండగా.. భారత్ నుంచి పది మంది బరిలో ఉన్నారు.