ఆడబిడ్డ పుడితే భారం అనుకుని బాధపడే రోజులు పోయాయి. సర్కారు దవాఖానలో ఉచితంగా డెలివరీ చేసి..కేసీఆర్ కిట్తోపాటు రూ.13వేల ఆర్థిక సాయం అందించి.. తల్లీబిడ్డను క్షేమంగా ఇంటి వద్ద దింపుతున్నది సర్కారు. బిడ్డ పెరిగాక ఉన్నత చదువుల వరకు ఉచిత విద్యనందిస్తున్నది..వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో కూడా బోధన ప్రారంభం కానున్నది. కల్యాణలక్ష్మి పేరిట రూ.లక్షా నూటపదహారు అందజేస్తూ భరోసానిస్తున్నది. ఇవే గాక ఆశ, అంగన్వాడీ, ఏఎన్ఎంలకు వేతనాలు పెంచి, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇచ్చి, షీ టీమ్స్తో భద్రత కల్పించి మహిళా బంధువుగా నిలిచారు సీఎం కేసీఆర్.
– నాగర్కర్నూల్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ)
సీఎం కేసీఆర్ మహిళా పక్షపాతిగా మారారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలు అమలు
చేస్తూ బంధువుగా నిలుస్తున్నారు. శిశువు పుట్టినప్పటి నుంచి వృద్ధురాలి వరకు అందరికీ సాయం అందేలా పథకాల రూపకల్పన చేశారు. దీంతో సీఎం కేసీఆర్ తండ్రిగా, మేనమామగా, సోదరుడిగా, మిత్రుడిగా మహిళల మనస్సుల్లో నిలిచారు. మహిళల సంక్షేమానికే మా తొలి ప్రాధాన్యమంటూ గతంలో ఎన్నో ప్రభుత్వాలు, పార్టీలు చెప్పుకొచ్చాయి. కానీ అవి మాటలకే పరిమితమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. కుల, మత తారతమ్యాలు లేకుండా అమలవుతున్న పథకాలపై మహిళల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
మహిళలకు తాగునీటి కష్టాలను తీర్చడంలో మిషన్ భగీరథ కీలకమైనది. గతంలో తాగునీటి కోసం మహిళలు రోడ్లెక్కి ఖాళీ బిందెలతో ధర్నాలు చేసే పరిస్థితులుండేవి. ఇప్పుడు మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛమైన నీళ్లు వస్తున్నాయి. దీంతో ప్రజల ఆరోగ్యంతోపాటు మహిళల కష్టాలూ శాశ్వతంగా తీరాయి.
వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆసరా పథకంతో ప్రతి నెలా పింఛన్లు అందుతున్నాయి. అలాగే ఒంటరిగా ఉంటూ నిరాదరణకు గురవుతున్న మహిళలను గతంలో ఏ పాలకులూ పట్టించుకోలేదు. వీరికి సైతం ఆసరా పథకం ద్వా రా 2020-21 నుంచి రూ.2016 చొప్పున పింఛన్లను అందజేస్తున్నారు. వితంతువులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తు లు, చేనేత కార్మికులకు సైతం ఆసరాగా నిలుస్తున్నారు. ఈ పథకంతో సీఎం కేసీఆర్ను మహిళలు సోదరుడిగా భావిస్తున్నారు.
బాలికల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేశారు. దీంతో పేద బాలికలకు ఆంగ్ల మాద్యమంలో నాణ్యమైన విద్యా బోధన అందుతున్నది. హైజీన్ కిట్లను పంపిణీ చేశారు. ఇక స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం గమనార్హం. దీంతో మార్కెట్, సింగిల్ విండో కమిటీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్పర్సన్లుగా రాజకీయంలో రాణిస్తున్నారు.
స్వయం సహాయక సంఘాల ద్వారా మ హిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నా రు. ఈ డబ్బులతో కిరాణ కొట్లు, టీ స్టాళ్లు, కుట్టు మిషన్లు, టైలరింగ్ పనులు చేసుకుం టూ కుటుంబాలను పోషించుకొంటున్నారు.
మహిళలపై వేధింపులు, అసభ్యకరంగా వ్యవహరించే పోకిరీలపై చర్యలు తీసుకుని రక్షణ కల్పించేందుకు షీ టీమ్స్ను ఏర్పాటు చేశారు. 100, 1098కు ఫోన్ చేస్తే క్షణాల్లో స్పందిస్తున్నారు. వీ హబ్ ద్వారా మహిళా వ్యాపారవేత్తల కోసం ఇంక్యుబేటర్ ప్రా రంభించారు. సాంకేతికతలో అభివృద్ధి చెం దుతున్న రంగాలపై దృష్టి సారించేలా వినూ త్న ఆలోచనలు, పరిష్కారాలు, ఎంటీటీలతో మద్దతు ఇస్తున్నారు.
మహిళల పురోగతికి కృషి చేస్తున్న ఆశ, అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం వేతనాలను పెంచింది. అంగన్వాడీల వేతనాలను రూ.4,200 నుంచి రూ.10,500 వరకు 150 శాతం చొప్పున పెంచారు. ఆశ కార్యకర్తలకు రూ.2,200 నుంచి రూ.6 వేలకు పెరిగాయి. కరోనా సమయంలోనూ వీరు ధైర్యంగా విధులు నిర్వర్తించారు. ఇంటింటికీ తిరిగి సర్వే, మందులు పంపిణీ చేశారు. కాగా, వారికి ప్రభుత్వం ఉచితంగా స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తున్నది.
అంగన్వాడీల ద్వారా గర్భిణులకు ఆరోగ్యలక్ష్మి పేరిట ఉచితంగా ఒక పూట ఆహారం, పౌష్టికాహారం అందిస్తున్నారు. 2015 జనవరి 1 నుంచి ఈ పథకం అమలవుతున్నది. గర్భిణులకు ఐరన్ టాబ్లెట్లు అందజేయడం, రక్తహీనత తగ్గించేలా సూచనలు, గుడ్లు, పాలు సైతం ఇస్తున్నారు. తక్కువ బరువున్న పిల్లలపై కమ్యూనిటీ ఆధారిత సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. పోషక అభియాన్, సమగ్ర బాలల సంరక్షణ పథకం, బాల సదనం వంటి కార్యక్రమాలు అమలవుతున్నాయి. సఖి కేంద్రాలతో మహిళలను గృహహింస, మోసాల నుంచి రక్షిస్తున్నారు. బాల్య వివాహాలను అరికట్టడం, అత్యాచారాలకు గురైన బాలికలు, మహిళలకు ఆర్థిక స్వావలంబన, వరకట్న వేధింపులు వంటి వాటిపై అవగాహన కల్పించడం, న్యాయపరమైన సలహాలు అందించడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. మాతాశిశు సంరక్షణ కోసం మౌలిక వసతులు కల్పించారు. అమ్మఒడి వాహనాలు అందుబాటులో ఉంచారు.
సీఎం కేసీఆర్కు మహిళలంటే ఎంతో ప్రేమ. పుట్టినప్పటి నుంచి పెండ్లితోపాటు వృద్ధురాలి వరకూ ప్రభుత్వమే బాధ్యత వహించేలా పథకాలు రూపకల్పన చేసిన ఘనత సీఎంకే దక్కుతుంది. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, గురుకులాలు, ఆసరా పింఛన్లు దేశంలోనే స్ఫూర్తిదాయకమైనవి. రాజకీయ రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించడంతో నాలాంటి ఎంతో మంది రాణిస్తున్నారు. మహిళలు ఇంటితోపాటు ఊరునూ పరిపాలించేలా చేసిన చరిత్ర సీఎం కేసీఆర్దే. ఆయనకే మహిళలందరి మద్దతు. మహిళల తరపున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– పద్మావతి, జెడ్పీ చైర్పర్సన్, నాగర్కర్నూల్
ఆడపిల్లల పెండిండ్లకు తల్లిదండ్రులు ఆర్థికంగా పడుతున్న కష్టాలను తగ్గించేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలు చేస్తున్నారు. 2014 అక్టోబర్ 2న ఈ పథకం రూ.51వేలతో ప్రారంభమైంది. 2017 మార్చి బడ్జెట్లో ఈ సాయాన్ని రూ.75,116కు పెంచగా.. 2018 మార్చి 19 నుంచి 1,00,116కు పెంచడం గమనార్హం. దీంతో అన్ని వర్గాల పేదలకు ఆర్థిక కష్టాలు తీరాయి.
సురక్షితంగా డెలివరీలను ప్రోత్సహించేందుకు, మాతా శిశు మరణాలను నివారించేందుకు ముఖ్యమం త్రి ‘కేసీఆర్ కిట్’ పథకాన్ని 2017 జూన్ 4వ తేదీన ప్రా రంభించారు. ఇందులో భాగంగా ఆడపిల్ల పుడితే రూ. 13వేలు, మగపిల్లాడు పుడితే రూ.12వేలు ఆర్థిక సా యం అందజేస్తున్నారు. అలాగే కేసీఆర్ కిట్లో బిడ్డకు ఉపయోగపడే బేబీ నూనె, బెడ్, సబ్బులు, డ్రస్సులు, దోమ తె ర, చీరలు, హ్యాండ్ బ్యాగ్స్, టవల్, న్యాప్కిన్లు, పౌడర్, డైపర్, షాంపూ, బొమ్మలు వంటి 16 రకాల వస్తువులను ఇస్తున్నారు.