సికింద్రాబాద్, జనవరి 22: గర్భాశయ క్యాన్సర్పై మహిళలు అప్రమత్తంగా ఉండాలని సౌమ్య క్యాన్సర్ దవాఖాన డైరెక్టర్, అంకాలజీ విభాగం అధిపతి డాక్టర్ పాలంకి సత్యదత్తాత్రేయ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరిని క్యాన్సర్ అవగాహన మాసంగా ప్రకటించిన నేపథ్యంలో తమ దవాఖాన తరఫున మహిళలకు గర్భాశయ క్యాన్సర్పై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. శనివారం దవాఖానలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రతీ వంద మందిలో దాదాపు 50 మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సోకిన వారు మృత్యువాత పడుతున్నారని అన్నారు.
దీనిని నిరోధించాలంటే హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమ వైరస్) టీకాలను వేయించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కౌమార దశ నుంచి 45 ఏండ్ల లోపు మహిళలకు ఈ టీకాలు వైద్యుల సూచనల మేరకు రెండు డోసుల్లో వేయించుకోవాల్సి ఉంటుందన్నారు. పాలకులు తగిన సహకారం అందిస్తే కంటోన్మెంట్లోని మురికివాడ ప్రాంతాల్లో క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమం లో దవాఖాన ప్రతినిధి ఎన్. జనార్దన్ పాల్గొన్నారు.