చిక్కడపల్లి, నవంబర్ 13 : చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మహిళా నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. ప్రొఫెసర్ రమ మెల్కోటె, ప్రొఫెసర్ లక్ష్మి, పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వీ సంధ్య పాల్గొని మాట్లాడారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అతిపెద్ద సంస్కరణ అయిన మహిళా రిజర్వేషన్ బిల్లు శీతలగిడ్డంగిలో సమాధి అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. సదస్సు అనంతరం ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో కనీజ్ఫాతిమా, రమ, బీ సుభద్ర, పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనురాధ, మహిళా నాయకులు నిర్మల, సరళ, పద్మ, జే ఐలమ్మ, నర్సక్క, కల్పన, జయసుధ, సుగుణ, వరలక్ష్మి, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.