IRCTC | కొన్ని సందర్భాల్లో అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి రావచ్చు. మనం బయలుదేరే వేళకు అందుబాటులో ఉన్న రైలుకో, బస్సుకు బయలుదేరి వెళతాం.. అప్పటికప్పుడు ప్రయాణమైనప్పుడు భోజనం తదితర అంశాలను పట్టించుకోం. రైలులో ప్రయాణిస్తే భారతీయ రైల్వేల అనుబంధ సంస్థ ‘ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) భోజన వసతి కల్పిస్తుంది.
అలా రొచి కొచ్చా అనే ఓ మహిళా రచయిత తన కుటుంబంతో బ్రహ్మపుత్ర ఎక్స్ప్రెస్లో కలిసి పాట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరారు. పది మందితో బయలు దేరినందున ఫుడ్ కోసం ఐఆర్సీటీసీ క్యాటరింగ్ విభాగానికి వెజ్ థాలీ భోజనం ఆర్డర్ చేసింది. ఫుడ్తోపాటు బిల్లు ఖచ్చితంగా ఇవ్వాలని కూడా స్పష్టంగా చెప్పారామె. కానీ ఐఆర్సీటీసీ క్యాటరింగ్ సిబ్బంది వెజ్ థాలీకి రూ.80 తోపాటు పనీర్ సబ్జీకి రూ.70 కలిపి బిల్లు వేశారు. తాము కేవలం వెజ్ థాలీ భోజనం మాత్రమే ఆర్డర్ చేసినా వినిపించుకోకుండా గంటసేపు వాదించారు. ఆ తర్వాత ఓ అధికారి వచ్చి వెజ్ థాలీకి రూ.80 బిల్లు ఇచ్చి వెళ్లారని ఆమె చెప్పారు.
తాము ఆర్డర్ చేయని ఫుడ్కూ బిల్లు వేసి ఐఆర్సీటీసీ సిబ్బంది వసూలు చేస్తున్నారంటూ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. వీరి ప్రవర్తన వల్ల భారతీయ రైల్వే ప్రతిష్ట దిగజారుతోందంటూ వాపోయారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఐఆర్సీటీసీ స్పందించింది. ఈ సంగతి తమ దృష్టికి తెచ్చినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపిన ఐఆర్సీటీసీ.. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ కు భారీ జరిమాన విధిస్తామని తెలిపింది.