చలికాలం ఏదైనా తినాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. లేదంటే దగ్గు, జలుబుతో పాటు గొంతు సమస్యలు దాడి చేస్తాయి. ఈ రుతువులో ఒంట్లో వేడిని పుట్టించే పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. వాటివల్ల ప్రయోజనాలు అపారం.
అవిసెలు: దీర్ఘకాలిక సమస్యలైన మధుమేహం, అధిక బరువు వంటి వాటిని నియంత్రిస్తాయి. అవిసెలు గుండె సంబంధ సమస్యలకూ చక్కని ఆహారం.
పండు మిర్చి: శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే పదార్థాల్లో పండు మిర్చి ఒకటి. జీర్ణ సంబంధ సమస్యల పరిష్కారానికి ఇది తోడ్పడుతుంది.
ఖర్జూరం: వీటిలో పీచు పదార్థం పుష్కలం. మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను అదుపులో ఉంచుతుంది.
అల్లం: దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. వాంతులు, వికారం వంటి సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది అల్లం.
దాల్చిన చెక్క: శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. టైప్-2 మధుమేహం నియంత్రణకు సాయపడుతుంది.
కాఫీ: దీనిలోని కెఫిన్ జీవ క్రియను మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, అలసటను నివారించడంలోనూ సాయపడుతుంది.
నెయ్యి: శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది. కనీస మోతాదులో తీసుకున్నంతకాలం సహాయకారిణిగా పనిచేస్తుంది.
చేపలు: వీటిలోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు (ఫాటీ యాసిడ్స్) అధిక బరువును నియంత్రిస్తాయి. గుండె పనితీరును మెరుగు పరచడంలో సాయపడతాయి.