పాల్గొననున్న విమాన సంస్థలు
హైదరాబాద్, మార్చి 23(నమస్తే తెలంగాణ):మళ్లీ విమానాల పండుగ వచ్చేసింది. రెండేండ్లకొకసారి హైదరాబాద్లో జరిగే ఆసియాలోని అతిపెద్ద విమానాల ప్రదర్శనకు బేగంపేట్ విమానాశ్రయం వేదికైంది. ‘వింగ్స్ ఇండియా 2022’ పేరుతో జరగనున్న ఈ విమాన ప్రదర్శణ ఈ నెల 27న ముగియనున్నది. ‘ఇండియా @ 75; న్యూ హారిజెన్ ఫర్ ఏవియేషన్ ఇండస్ట్రీ’ అనే థీమ్తో సాగనున్న ఈ ప్రదర్శనలో దేశ, విదేశాలకు చెందిన పలు విమానయానరంగ కంపెనీలు పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. తొలి రెండు రోజులు విమానయాన రంగానికి చెందిన సంస్థల తమ ఉత్పత్తుల గురించి వివరించనున్నాయి. ఈ రంగంలో వస్తున్న నూతన సాంకేతికత, నిర్వహణలో వస్తున్న కొత్త విధానాలు, నూతన పరికరాలు, ఆర్థిక వనరులు, ఆయా దేశాల్లో అనుసరిస్తున్న విధానాలు, వివిధ బిజినెస్ మోడల్స్, కొత్త భాగస్వామ్యాలు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నాయి. ముఖ్యంగా దేశంలో విమానాల విడిభాగాల తయారీ, నిర్వహణ, ఎంఆర్వోల ఏర్పాటు తదితర అంశాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు.