హుజూరాబాద్ : కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఇచ్చి ఆదుకున్నటీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేస్తారా? లేక రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి కార్లతో రైతులను తొక్కి చంపిస్తున్న బీజేపీకి ఓటేస్తారో ప్రజలే నిర్ణయించుకోవాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు.
గురువారం నియోజకవర్గంలోని పెదపాపయ్యపల్లిలో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని, మరి బీజేపీ ఏం చేసిందని ఓటేస్తారని హరీశ్రావు ప్రశ్నించారు. మేము ఇచ్చిన హామీ ప్రకారం రూ.200 ఉన్న పెన్సన్ను 2000లకు పెంచాం. మహిళలకు కేసీఆర్ కిట్, రైతులకు రైతు బంధు, ఆడపిల్లల పెండ్లికి లక్షా నూటపదహార్లు కల్యాణలక్ష్మి ఇస్తున్నాం.
రైతు రుణమాఫీ లక్షలోపు చేస్తామన్నాం. 25 వేలలోపు రుణాలు మాఫీ చేశాం. 50 వేల లోపు రుణాలు ఇప్పుడు మాఫీ చేస్తున్నాం. వచ్చే మార్చి లోపు లక్ష రూపాయల లోపు రుణాలు వడ్డీతో సహా మాఫీ చేస్తాం. మేము ఇన్ని చేశాం మరి బీజేపీ ఏం చేసింది? అని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతులను రోడ్డు మీదకు తెచ్చింది. ఈ చట్టాలు వెనక్కు తీసుకోవాలని రైతులు రోడ్డు మీదకు వస్తే వారిని మంత్రుల కార్ల కాన్వాయ్ తో ఎక్కి తొక్కించారు. ఈటల రాజేందర్ పెద పాపాయ్యపల్లికి వచ్చి ఏమని ఓట్లు అడుగుతావు ? రైతులను కార్లతో ఎక్కితొక్కించాము ఓట్లు వేయమని అడుగుతావా.. ? అంటూ హరీశ్రావు ఎద్దేవా చేశారు.
నేను అబద్దాలు ఆడుతున్నా అని రాజేందర్ అంటున్నడు. నేను ఏమి చెప్పిన…ఆసరా పెన్షన్ ఇస్తున్నామని చెప్పిన…కళ్యాణ లక్షి ఇస్తున్నామని చెప్పిన, కేసీఆర్ కిట్ , రైతు బీమా, రైతు బంధు, ఉచిత కరెంట్ , కాళేశ్వరం నీరు ఇస్తున్నామని చెప్పిన ఇందులో అబద్దాలు ఏమున్నాయో రాజేందర్ చెప్పాలే. నేను చెప్పినవి అబద్ధాలైతే పెద్ద పాపాయ్య పల్లి శివాలయం వేప చెట్టు దగ్గర జనం మధ్యకు రా మాట్లాడదం అంటూ మంత్రి సవాలు విసిరారు.
మరి బీజేపీ ఏం చేసింది. డీజిల్ వంద రూపాయలకు పెంచింది. పెట్రోల్ 106 రూపాయలకు పెంచారు. గ్యాస్ బండ వెయ్యి చేసారు. రైళ్లు, విమనాలు, ఎల్.ఐ.సీ అన్ని అమ్ముతున్నరు. విశాఖ ఉక్కు అమ్ముతున్నరు. ఉద్యోగాలు ఊడగొడుతున్నరు. ఇందులో అబద్దాలున్నాయా? అని మంత్రి అడిగారు. ప్రజలకోసం అనేక పథకాలు తీసుకువచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టాలని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు.