హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): వరంగల్ ఎంజీఎంలో రోగిని ఎలుక కొరికిన ఘటనలో పారిశుద్ధ్య కార్మికుడిని బాధ్యుడిగా చేస్తూ బ్లాక్ లిస్ట్లో చేర్చడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. షోకాజ్ నోటీసు ఇచ్చిన రోజే బ్లాక్ లిస్ట్లో చేర్చడం సరికాదని చెప్పింది. నోటీసు అందిన తర్వాత జవాబు ఇచ్చేందుకు గడువు ఇవ్వకపోవడం సరికాదని పేర్కొన్నది. బ్లాక్ లిస్ట్లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ సెక్యూరిటీ, ఇతర మ్యాన్ పవర్ సరఫరా చేస్తున్న ఏజిల్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన రిట్ను జస్టిస్ అభిషేక్రెడ్డి ఇటీవల విచారించారు. బ్లాక్ లిస్ట్లో పెడుతూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీచేశారని, వివరణ ఇచ్చేలోగానే బ్లాక్ లిస్ట్లో పెట్టేశారని, మధ్యాహ్నం నోటీసు ఇచ్చి, ఆదే రోజు రాత్రే బ్లాక్ లిస్ట్లో పెట్టేశారని పిటిషనర్ న్యాయవాది వాదించారు. కౌంటర్ దాఖలు చేయాలని ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. విచారణను వాయిదా వేసింది.