హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): గతేడాది మాదిరిగానే ఈ వానకాలంలోనూ మొత్తం ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. కొనుగోళ్లపై రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని భరోసా ఇచ్చారు. సోమవారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 6,545 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాలశాఖ అధికారులను ఆదేశించారు. ధాన్యాన్ని శుభ్రపరిచి తేమ, తాలు లేకుండా ఆరబోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొనిరావాలని రైతులకు సూచించారు. మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకొంటామని తెలిపారు. కొంతకాలంగా ధాన్యం కొనుగోళ్లపై అటు కేంద్రం, ఇటు భారత ఆహార సంస్థ (ఎఫ్ఐసీ) గందరగోళం సృష్టించాయి. దొడ్డు వడ్లు కొనేదిలేదని భీష్మించాయి. దీనికితోడు ప్రతిపక్షాల కుట్రలు తోడయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రైతుల్లో నెలకొన్న ఆందోళనను దూరం చేస్తూ ధాన్యం కొనుగోళ్లపై నిర్ణయం తీసుకొన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఉత్తర్వులను పౌరసరఫరాలశాఖ జారీచేసింది. సమీక్షాసమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, సీఎంవో అధికారులు నర్సింగ్రావు, భూపాల్రెడ్డి, ప్రియాంకవర్గీస్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
మానకొండూర్ రూరల్/కమలాపూర్, అక్టోబర్ 18: వానకాలం వడ్లు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతున్నాయి. సోమవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని తొమ్మిది గ్రామాల్లో సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రారంభించారు. ముంజంపల్లి, గంగిపల్లి, కొండపల్కల, మద్దికుంట, పచ్చునూర్, ఊటూర్, రంగపేట, దేవంపల్లి, లలితాపూర్ గ్రామాల్లో కేంద్రాలను తెరిచి, ధాన్యం కాంటాలు మొదలుపెట్టారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయాధికారి జాలీ లక్ష్మారెడ్డి ప్రారంభించారు.