KS Bharat : ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు ముందు తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత పిచ్లపై ఆసీస్ మీడియా, మాజీ క్రికెటర్లు అనవసర రాద్దాంతం చేస్తున్నారని అతను అన్నాడు. ఇండియన్ పిచ్ల మీద ఆడడం ఏమంత కష్టం కాదని భరత్ తెలిపాడు. ‘షాట్ ఎంపిక అనేది చాలా కీలకం. షాట్ సెలక్షన్ సరిగ్గా ఉంటే రన్స్ వాటంతట అవే వస్తాయి. భారత గడ్డపై రాణించాలంటే డిఫెన్స్ను నమ్ముకోవడం చాలా ముఖ్యం’ అని భరత్ వెల్లడించాడు. అంతేకాదు కెప్టెన్ రోహిత్ శర్మ తనకు మద్దతివ్వడం గురించి కూడా చెప్పుకొచ్చాడు.
‘ఢిల్లీ టెస్టు రెండో ఇన్నింగ్స్లో నువ్వు ఆరో స్థానంలో బ్యాటింగ్కు వెళ్తావు అని రోహిత్ భాయ్ నాతో చెప్పాడు. అప్పటికే ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. దాంతో, నేను పరుగులు సాధించి జట్టును గెలిపించడానికి సిద్ధంగా ఉన్నా. క్రీజులోకి వెళ్లగానే రన్స్ చేయడంపై దృష్టి పెట్టాను. ఒక ఆటగాడిగా అవకాశం తలుపు తట్టేంత వరకు ఎదురుచూశాను’ అని భరత్ తెలిపాడు. ఆడుతున్నది తొలి మ్యాచ్ అయినా భరత్ ఆకట్టుకున్నాడు. వికెట్ల వెనకాల చురుకుగా ఉండడమే కాకుండా డీఆర్ఎస్ విషయంలోనూ కీలకంగా వ్యవహరించాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. దాంతో అతడినే ఆఖరి రెండు టెస్టులకు కీపర్గా కొనసాగించే అవకాశం ఉంది.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భరత్ టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు. మాజీ కోచ్ రవిశాస్త్రి నుంచి అతను టెస్టు క్యాప్ అందుకున్నాడు. ఏడాది క్రితం టెస్టు జట్టుకు ఎంపికైనా కూడా ఏడాది కాలంగా భరత్ బెంచ్కే పరిమితం అయ్యాడు. అయితే.. రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కారు యాక్సిడెంట్లో గాయపడడంతో అతడిని, ఇషాన్ కిషన్ను బీసీసీఐ ఎంపిక చేసింది. కానీ, రంజీల్లో అనుభవం ఉన్న భరత్కే కోచ్, కెప్టెన్ అవకాశం ఇచ్చారు. వచ్చిన అవకాశాన్ని ఈ క్రికెటరల్ రెండు చేతులా ఒడిసి పట్టకున్నాడు. ఢిల్లీ టెస్టులో 23 రన్స్తో నాటౌట్గా నిలిచాడు. పూజారాతో కలిసి జట్టును గెలిపించాడు. రెండో ఇన్నింగ్స్లో ఎటాకింగ్ గేమ్ ఆడిన అతను 3 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు.
భారత పర్యటనను తేలికగా తీసుకున్న ఆస్ట్రేలియా మొదటి రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడిపోయింది. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ చెలరేగడంతో నాగ్పూర్ టెస్టులో ఇన్నింగ్స్ 132 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. ఢిల్లీ టెస్టులోనూ స్పిన్ ఉచ్చులో పడిన ఆ జట్టును ఐదు వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. దాంతో, ఇండియా నాలుగు టెస్టుల సిరీస్లో 2-0తో ఆధిక్యంలో ఉంది. భారత్, ఆసీస్ మధ్య మూడో టెస్టు ఇండోర్లో మార్చి 1న జరగనుంది.