హైదరాబాద్, జనవరి 27 : తన ప్రయోజనాలకోసం అన్ని రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేయడం బీజేపీకి వెన్నెతో పెట్టిన విద్య. ఇప్పుడు తాజాగా పార్లమెంట్ సభ్యుల హక్కులను కాపాడే కమిటీని కూడా ఇందుకు వాడుకొంటున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ ఉదంతమే ఉదాహరణ అని చెప్తున్నారు. ఒక ఎంపీగా బాధ్యతను మరిచి యథేచ్ఛగా కరోనా నిబంధనలను ఉల్లంఘించి నానా హంగామా చేయడంపై చర్యలు తీసుకొంటే.. ఆయన హక్కులకే భంగం కలిగిందంటూ వాదించడం విడ్డూరమని పలువురు అంటున్నారు. ఎంపీ బాధ్యతారాహిత్యానికి బోనులో నిలబెట్టాల్సిన కేంద్రం.. ఆయనకే వత్తాసు పలుకుతూ.. చర్యలు తీసుకొన్న అధికారులకు షోకాజు నోటీసులివ్వడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు, శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఓవైపు ఇలాంటి పనులు చేస్తూనే హక్కులకు భంగం కలిగించారంటూ వీధికెక్కడం సంజయ్కే చెల్లిందని అంటున్నారు.
ఎంపీలందరూ సమానం కాదా?
ఎంపీలందరి పట్ల సమానంగా వ్యవహరించాల్సిన హక్కుల కమిటీ.. బీజేపీ ఎంపీల పట్ల ఒక విధంగా.. ఇతర పార్టీల ఎంపీల పట్ల మరో విధంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలున్నాయి. ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ తన హక్కులకు భంగం కలిగిందని ఫిర్యాదు ఇస్తే దానిపై హక్కుల కమిటీ స్పందించలేదు. ఏపీలో తనను పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారని ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే ఆరునెలలైనా పట్టించుకోలేదు. బండి సంజయ్ ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రం పక్షం రోజుల్లోనే స్పందించింది. ఈ నెల 21న కమిటీ ముందు బండి సంజయ్ హాజరై వివరణ ఇచ్చిన మరుసటిరోజే రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. బండి ఫిర్యాదుపై వెంటనే స్పందించిన ప్రివిలేజ్ కమిటీ.. తన ఫిర్యాదుపై ఎందుకు ఆలస్యం చేస్తున్నదో తెలియడంలేదని రఘురామ ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ గత జూన్లో టైమ్స్నౌ చానల్పై హక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చారు. కానీ.. దానిపై ఎలాంటి చర్యలు తీసుకొన్నారో ఇప్పటివరకు తెలియదు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్పై శివసేన ఎంపీ సంజయ్రౌత్ సహా.. పదిమందికి పైగా రాజ్యసభ సభ్యులు హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తే.. ఎంపీల హక్కుల కమిటీ ఇప్పటి వరకు దాని వంక చూసింది లేదని విమర్శకులంటున్నారు. ఇలా చాలా హక్కుల ఉల్లంఘన నోటీసులు కమిటీ ముందు పెండింగ్లో ఉన్నాయి. వాటిని వదిలేసి.. బండి ఫిర్యాదుపై మాత్రం ఆగమేఘాలపై స్పందించడం గమనార్హం.