న్యూఢిల్లీ: గతంలో రైతుల ఏడాది పాటు నిరసనలకు దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఈసారి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలోని విద్యార్థుల ఆందోళలకు కేవలం 37 రోజుల్లోనే తలొగ్గింది. ప్రధానంగా జెన్ జెడ్కు చెందిన యువత పోరాటం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. (CJP Protest) దీంతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే సుమారు నెల రోజుల్లోనే విధానపరంగా కేంద్రం వెనుకడుగు వేయడానికి పలు కారణాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మే 3న నీట్ పరీక్ష నిర్వహించగా పేపర్ లీకైనట్లు రెండు రోజుల్లోనే బయటపడింది. దర్యాప్తుతో ఇది నిజమని తేలడంతో నీట్ను రద్దు చేస్తున్నట్లు మే 12న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. జూన్ 21న రీటెస్ట్ నిర్వహించి, జూలై 16న రిజల్ట్స్ విడుదల చేసింది.
కాగా, నీట్ రద్దు తర్వాత దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అలాగే నీట్ రీటెస్ట్తో పాటు ఫలితాలపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నీట్ పేపల్ లీక్పై గళమెత్తారు. జూన్ 20న విదేశాల నుంచి ఢిల్లీ చేరుకున్న ఆయన విద్యార్థులతో కలిసి జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరసన ప్రారంభించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు లఢక్ ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ విద్యార్థుల నిరసనకు మద్దతు తెలిపారు. జూన్ 28 నుంచి జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి ఈ ఉద్యమంలో భాగమయ్యారు. జూలై 18 నాటికి ఆయన నిరాహార దీక్ష 21వ రోజుకు చేరింది. తీవ్ర అస్వస్థతకు గురైన వాంగ్చుక్ను ఢిల్లీ పోలీసులు నిరసన వేదిక నుంచి బలవంతంగా తరలించారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆసుపత్రిలో చేర్పించారు.
అయితే ఈ చర్య విద్యార్థి నిరసనకారులలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. దీనికి ప్రతిస్పందనగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నిరవధిక ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో జూలై 20న నిరసనకారులు ‘సంసద్ చలో’ ర్యాలీ నిర్వహించారు. దీనిని పోలీసులు కఠినంగా అడ్డుకున్నారు. విద్యార్థులపై లాఠీలు ఝుళిపించారు. బాష్పాయువుతో పాటు పెల్లెట్ గన్స్ ప్రయోగించారు.
కాగా, జూలై 20న విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల అచారకాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ముంబై, కోల్కతా, పాట్నా, బెంగళూరు వంటి మహా నగరాల్లో విద్యార్థుల ఆందోళనలు ఉద్రిక్తలకు దారితీసింది. ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి.
అయితే గతంలో రైతుల ఏడాది పాటు నిరసనలకు దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఈసారి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలోని విద్యార్థుల ఆందోళలకు కేవలం 37 రోజుల్లోనే తలొగ్గింది. ప్రధానంగా 21 రోజులకుపైగా సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష, జూలై 20న విద్యార్థుల ‘సంసద్ చలో’ ర్యాలీలో ఉద్రిక్తతలు ప్రధానంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చాయి. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో జెన్ జెడ్ యువత నిరసనల ప్రభావంపై కేంద్రం మరింత ఆందోళన చెందింది.
కాగా, గతంలో ఢిల్లీలో రైతుల నిరసనలు, సీఏఏకు వ్యతిరేకంగా షాహీన్ బాగ్లో ముస్లింల ఆందోళన సందర్భంగా దేశద్రోహం, దేశ వ్యతిరేక ఆందోళనలు, విదేశాల కుట్ర వంటి ఆరోపణలతో సీజేపీ నిరసనలు అణగదొక్కందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
మరోవైపు సీజేపీ నిరసనకారులు ప్రధానంగా బీజేపీ అధికారంలోఉన్న ఉత్తర భారత రాష్ట్రాలకు చెందినవారు. అందులోనూ బీజేపీ మంత్రులు, నేతలకు చెందిన పిల్లలు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేతపట్టి పార్టీలకు అతీతంగా ఉద్యమించారు. మోదీ ప్రభుత్వ అనుకూల మీడియాను బహిష్కరించారు. ‘ యువ, విద్యావంతులైన, ప్రధానంగా ఉత్తర భారత హిందువులు’ కావడంతో యువత పోరాటం మోదీ ప్రభుత్వాన్ని మరింత కలవరపరిచింది.
అలాగే రోజు రోజుకు విద్యార్థుల ఉద్యమం మరింత ఉధృత్వం కావడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరిపింది. చివరకు వారి డిమాండ్లకు కేంద్రం తలొగ్గింది. దీంతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం రాజీనామా చేశారు. విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబాలకు కోటి పరిహారం, విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు వంటి సీజేపీ ఇతర డిమాండ్లను కూడా కేంద్రం అంగీకరించింది.