న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కేసుల పెరుగుదల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ మరింత ప్రబలకుండా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తక్షణమే అవరసరమైన చర్యలు చేపట్టాలని ఆయా దేశాలను కోరింది. అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో కొద్దివారాలుగా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోందని, మహమ్మారి కట్టడికి మౌలిక చర్యలపై తిరిగి మనం కేంద్రీకరించాల్సి ఉందని డబ్ల్యూహెచ్ఓ దక్షిణాసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో పలు దేశాలు నూతన వేరియంట్ల వ్యాప్తి ప్రబలుతోందని వెల్లడించాయి. ఎలాంటి వేరియంట్స్ వెలుగుచూసినా కరోనా కట్టడికి మార్గదర్శకాలను విధిగా పాటించాలని డాక్టర్ సింగ్ స్పష్టం చేశారు. వైరస్ కేసులను గుర్తించడం, పరీక్షలు ముమ్మరం చేసి రోగులను క్వారంటైన్ పాటించేలా చేయడం చేపట్టాలని అన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆమె పేర్కొన్నారు.