కరీంనగర్ : ప్రధాని మోదీ సంప్రదింపులు అనే మాట మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు.
పార్లమెంట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ వ్యాఖ్యలకు నిరిసనగా కరీంనగర్లో మంత్రి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మార్క్ ఫెడ్ మైదానం నుంచి తెలంగాణ చౌక్ వరకు తెలంగాణ ద్రోహీ బీజేపీ అంటూ నల్ల బ్యాడ్జిలు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీజేపీ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేసారు.
కార్యక్రమంలో నగర మేయర్ సహా వేలాది మంది టీఆర్ఎస్ శ్రేణులు, నేతలు, తెలంగాణ అభిమానులు పాల్గొన్నారు. తెలంగాణపై కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న తీరుపై, పదే పదే తెలంగాణ బిల్లును అవమానిస్తున్న ప్రధాని వాఖ్యలపై మంత్రి గంగుల ధ్వజమొత్తారు.
2016లో నోట్ల రద్దు నిర్ణయం 135 కోట్ల మంది భారతీయుల్ని సంప్రదించి తీసుకున్నారా అని సూటిగా ప్రశ్నించారు. ఏటీఏంల వద్ద, బ్యాంకుల వద్ద బారులు తీరి చనిపోయిన ప్రజలకు ఎవరు బాధ్యులు అన్నారు.
దేశవ్యాప్తంగా జీడీపీ తగ్గుతొంది నిజం కాదా..పరిశ్రమలు మూతబడుతున్నాయి, ప్రైవేటీకరణ చేస్తూ రిజర్వేషన్లు అందకుండా కుట్రలు చేస్తూ మత కలహాలు పెంచడం ఇదేనా బీజేపీ సాధించిన అభివృద్ధి అని ప్రశ్నించారు.
ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి గంగుల డిమాండ్ చేశారు.