జట్టు పేరులో హైదరాబాద్ అని ఉందనే మాటే కానీ.. ఎప్పుడూ స్థానిక ఆటగాళ్లకు పెద్దగా అవకాశాలు ఇవ్వని సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఈ సారి వేలంలో వింత ఎంపికలతో మరింత ఆశ్చర్య పరిచింది. ఐపీఎల్కే బ్రాండ్ అంబాసిడర్ లాంటి డేవిడ్ వార్నర్ను ఇగోకు పోయి వదిలేసుకున్న రైజర్స్.. ఆ స్థాయి ఆటగాడిని వేలంలో కొనుగోలు చేసుకోలేకపోయింది. ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న కేన్ విలియమ్సన్ను అట్టిపెట్టుకున్న హైదరాబాద్.. దేశవాళీ స్టార్లపైనా దృష్టి పెట్టలేదు. నిలకడలేని నికోలస్ పూరన్ కోసం పది కోట్లకు పైగా వెచ్చించిన సన్రైజర్స్.. మరో రెండు కోట్లు వేస్తే శ్రేయస్ అయ్యర్ దక్కే అవకాశం ఉన్నా.. ఆ ప్రయత్నమే చేయలేదు. గతంలో తమ జట్టుకు ఆడిన శిఖర్ ధవన్ను తిరిగి తీసుకునేందుకూ ఆసక్తి చూపలేదు. లీగ్ మొత్తంలో అత్యుత్తమ బౌలింగ్ దళంగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్.. రషీద్ ఖాన్ లాంటి ప్లేయర్ను కొనుగోలు చేయలేకపోయింది. గతంలో వార్నర్, బెయిర్స్టో, విలియమ్సన్, రషీద్ఖాన్, హోల్డర్ వంటి విదేశీ స్టార్లతో కళకళలాడిన రైజర్స్.. ఈసారి పేరున్న ఆటగాళ్ల జోలికే పోలేదు. పూరన్, మార్కరమ్ తప్ప మిగిలిన ఐదుగురు (సీన్ అబాట్, రొమారియా షెఫర్డ్, జాన్సెన్, ఫిలిప్స్, ఫజల్లాఖ్ ఫారూఖీ) విదేశీ ఆటగాళ్ల పేర్లు అభిమానులకు పెద్దగా పరిచయం లేనివే! స్వదేశీ ఆటగాళ్లనైనా సరైన వాళ్లను ఎంపిక చేసుకున్నారా అంటే అదీ లేదు. పెద్ద మ్యాచ్లు ఆడిన అనుభవం ఎక్కువ లేని అబ్దుల్ సమద్ను వేలానికి ముందే అట్టి పెట్టుకున్న రైజర్స్.. అభిషేక్ శర్మ కోసం ఆరున్నర కోట్లు ఖర్చు చేసింది. టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాషింగ్టన్ సుందర్ తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ వాళ్లెవరినీ తీసుకోలేదు. కోల్కతా తరఫున కొన్ని మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన రాహుల్ త్రిపాఠి కోసం భారీ మొత్తాన్ని వెచ్చించిన యాజమాన్యం.. తుది జట్టులో ఉంటాడనే నమ్మకం లేని యువ పేసర్ కార్తీక్ త్యాగికి నాలుగు కోట్లు కట్టబెట్టింది. ఇప్పటికే భారత జట్టుకు దాదాపుగా దూరమైన భువనేశ్వర్లో పాత మెరుపు లేకపోగా.. బౌలింగ్ భారం నటరాజన్పై పడేలా కనిపిస్తున్నది. గాయం నుంచి కోలుకోని విలియమ్సన్కు డిప్యూటీ ఎవరనే అంశంపై కూడా స్పష్టత లేదు. దేశవాళీల్లో రాణిస్తున్న స్థానిక ఆటగాళ్లు తిలక్ వర్మ, సీవీ మిలింద్, రాహుల్ బుద్ది వైపు కన్నెత్తి కూడా చూడని సన్రైజర్స్.. ఒక్క తెలుగు ఆటగాడిని కూడా ఎంపిక చేసుకోలేదు. వార్నర్ను వదిలేసుకోవడంతోనే అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న సన్రైజర్స్.. తాజా నిర్ణయాలతో వారికి మరింత దూరమైనట్లు కనిపిస్తున్నది.
సన్రైజర్స్ సైన్యం
విలియమ్సన్ (14 కోట్లు), సమద్ (4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (4 కోట్లు), ప్రియమ్ గార్గ్ (20 లక్షలు), అభిషేక్ శర్మ (6.50 కోట్లు), కార్తీక్ త్యాగి (4 కోట్లు), సౌరభ్ దూబే (20 లక్షలు), భువనేశ్వర్ (4.20 కోట్లు), శ్రేయస్ గోపాల్ (75 లక్షలు), శశాంక్ (20 లక్షలు), సీన్ అబాట్ (2.40 కోట్లు), రాహుల్ త్రిపాఠి (8.50 కోట్లు), సమర్థ్ (20 లక్షలు), సుచిత్ (20 లక్షలు), మార్క్మ్ (2.60 కోట్లు), పూరన్ (10.75 కోట్లు), షెఫర్డ్ (7.75 కోట్లు), జాన్సెన్ (4.20 కోట్లు), వాషింగ్టన్ సుందర్ (8.75 కోట్లు), విష్ణు వినోద్ (50 లక్షలు), నటరాజన్ (4 కోట్లు), ఫిలిప్స్ (1.50 కోట్లు), ఫారూఖీ (50 లక్షలు)